ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కాలం చెల్లిన డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు 5,500 ఎలక్ట్రిక్ బస్సులను విడతల వారీగా ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు బస్సుల కేటాయింపు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపింది.
ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక విద్యుత్ బస్సులను కేటాయించింది. ప్రధానమంత్రి ఈ-బస్సు పథకంలో భాగంగా రాష్ట్రానికి ఎలక్ట్రిక్ బస్సులను కేటాయిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న డిజల్ బస్సుల్లో కొన్ని కాలం చెల్లాయి. వీటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ఏపీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. పర్యావరణాన్ని రక్షించేందుకు ఏకంగా 5,500 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ తీసుకురానుండగా.. 500 సీఎన్జీ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. దశలవారీగా ఈ బస్సులు రోడ్డెక్కనున్నాయి. 750 బస్సుల్లో 300 బస్సులు జులై నుంచి పరుగులు పెట్టనున్నాయి.
2027 మార్చి నాటికి..
450 బస్సులు ఆగస్టులో రోడ్లపైకి రానున్నాయి. తిరుపతి, కర్నూలు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, అమరావతి, గుంటూరు, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి నగరాల్లో ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సులు సర్వీసులు అందించనున్నాయి. కాలం చెల్లిన పల్లె వెలుగు, సిటీ బస్సులు, ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్దతిలో రాష్ట్ర ప్రభుత్వం 1450 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకోవాలని ప్లాన్ చేసింది. జులై నాటికి వీటికి టెండర్లను ఆహ్వానించనున్నారు. అనంతరం 2027 మార్చి నాటికి వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు. పూర్వోదయ అనే పథకం కింద కేంద్రం రాష్ట్రాలకు విద్యుత్ బస్సులను కేటాయిస్తోంది. అందులో భాగంగా ఏపీకి వెయ్యి బస్సులను కేటాయించింది.
కేంద్రానికి ప్రతిపాదనలు
ఇక పీఎం ఈ డ్రైవ్ పథకం కింద మరో 2 వేల బస్సుల మంజూరు కోసం కేంద్రానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రతిపాదనలు పంపింది. అలాగే 500 సీఎన్జీ బస్సులు కూడా తీసుకోవాలని చూస్తోంది. సీఎన్జీ ఎక్కువగా అందుబాటులో ఉండే నగరాల్లో వీటిని నడపనుంది. ప్రస్తుతం ఉన్న రంగులతోనే ఈ బస్సులు ఉండనున్నాయి. దీంతో ప్రయాణికులకు గందరగోళానికి గురి కాకుండా ఉంటారని ప్రభుత్వం చెబుతోంది. ఇక సీఎన్జీ బస్సుల కోసం సీఎన్జీ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది.

