తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పెట్రోల్ కష్టాలు వర్ణనాతీతం. ఆదిలాబాద్ నుంచి చిత్తూరు దాకా ఏ బంకు చూసినా ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న చోట కిలోమీటర్ల మేర క్యూ లైన్లు, తోపులాటలతో యుద్ధ వాతావరణం నెలకొంది. లీటర్ ఆయిల్ దొరికితే చాలు మహాప్రభో అని జనం అల్లాడిపోతున్న వేళ, ఒక వ్యాపారి తెలివైన ఆలోచన ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పెట్రోల్ కష్టాలు వర్ణనాతీతం. ఆదిలాబాద్ నుంచి చిత్తూరు దాకా ఏ బంకు చూసినా ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న చోట కిలోమీటర్ల మేర క్యూ లైన్లు, తోపులాటలతో యుద్ధ వాతావరణం నెలకొంది. లీటర్ ఆయిల్ దొరికితే చాలు మహాప్రభో అని జనం అల్లాడిపోతున్న వేళ, ఒక వ్యాపారి తెలివైన ఆలోచన ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రస్తుతం నెలకొన్న ఇంధన కొరత నేపథ్యంలో ఒక ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్ ప్రకటించిన ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో రేళ్ల సతీష్ అనే ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్ తన నూతన స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఏదైనా నెట్వర్క్ నుంచి ఎయిర్టెల్ లోకి పోర్ట్ (MNP) అయ్యే కస్టమర్లకు.. లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తామని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. బంకుల దగ్గర గంటల తరబడి వేచి చూసినా దొరకని పెట్రోల్, ఇక్కడ సిమ్ మారిస్తే చిటికెలో వస్తుండడంతో వాహనదారులు ఈ స్టోర్ ముందు క్యూ కట్టారు.
ఇదిలావుంటే, అధికారులు ‘ప్యానిక్ బయ్యింగ్’ అని చెబుతుండగా, డిపోల నుంచే స్టాక్ రావడం లేదని బంకు యజమానులు అంటున్నారు. కొన్ని చోట్ల ఉద్రిక్తతల మధ్య పోలీస్ బందోబస్తుతో పెట్రోల్ పంపిణీ చేస్తున్నారు. డబ్బా ఆయిల్ అయినా సరే ఇవ్వాలని సామాన్యులు కోరుతున్నారు. పెట్రోల్ కోసం జనం పడుతున్న ఇబ్బందులను గమనించి, సదరు వ్యాపారి తన పబ్లిసిటీ కోసం ఈ “లిక్విడ్ గోల్డ్” ఆఫర్ను ఎంచుకోవడం ఇప్పుడు రెండు జిల్లాల్లో హాట్ టాపిక్గా మారింది. బతుకు బండి నడవడమే కష్టంగా ఉన్న సమయంలో, ఈ లీటర్ పెట్రోల్ ఆఫర్ వాహనదారులకు పెద్ద ఊరటనిస్తోంది.

