ఎబోలా వైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారు లేదా ఆ దేశాల గుండా ప్రయాణించిన వారు జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లి స్థానిక ఆరోగ్య అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించింది. ప్రస్తుతం భారతదేశంలో ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
ఆఫ్రికా ఖండాన్ని ఎబోలా వైరస్ మరోసారి వణికిస్తోంది. ప్రత్యేకించి కాంగోలో ఎబోలా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రెండు వారాల్లోనే వందలాది మంది ఎబోలా వైరస్ బారిన పడటం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఎబోలాకు చెందిన అరుదైన బుండిబుగ్యో స్ట్రెయిన్ కారణంగా మరణాలు పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హైఅలర్ట్ ప్రకటించింది. ప్రపంచ దేశాలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. ఈ తరుణంలో భారత ప్రభుత్వం మరో కీలక ప్రకటన విడుదల చేసింది.. ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ భయం నెలకొన్న నేపథ్యంలో, ప్రభావిత దేశాల నుండి ప్రయాణించిన లేదా ఆ దేశాల గుండా ప్రయాణించిన వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని కోరుతూ ప్రభుత్వం మంగళవారం కొత్త సలహాను జారీ చేసింది. భారతదేశంలో ఎబోలా కేసులు ఏవీ నిర్ధారించబడలేదని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక వివరణాత్మక ప్రకటనలో స్పష్టం చేసింది. అలాగే, ఎబోలా ప్రభావిత దేశాలకు ప్రయాణించి, కొన్ని నిర్దిష్ట లక్షణాలు కనిపిస్తున్న వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లి, స్థానిక ఆరోగ్య అధికారులకు తెలియజేయాలని సూచించింది.
ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
“గత 21 రోజుల్లో మీరు ఎబోలా ప్రభావిత దేశం నుండి ప్రయాణించి వచ్చినా లేదా ఆ దేశం గుండా ప్రయాణించినా, మీకు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, విరేచనాలు, లేదా కారణం తెలియని రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే, మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోండి.. స్థానిక ఆరోగ్య అధికారులకు తెలియజేయండి” అని ఆ సలహాలో పేర్కొన్నారు.
ఏ సహాయం కోసమైనా అధికారులను సంప్రదించడానికి ఉపయోగపడే 1075 అనే హెల్ప్లైన్ నంబర్ను కూడా ప్రభుత్వం తెలిపింది. “ముందస్తుగా సమాచారం అందించడం ప్రాణాలను కాపాడటమే కాకుండా, వ్యాధి వ్యాప్తిని నివారించడంలో కూడా సహాయపడుతుంది” అని ఆ ప్రకటనలో అధికారులు తెలిపారు.
ప్రభుత్వం ప్రయాణించకూడని దేశాలైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ల జాబితాను ప్రకటించిన కొద్ది రోజులకే ఈ తాజా ప్రకటన వెలువడింది.
భారతదేశంలో ఎబోలా భయమా?
గత కొన్ని వారాలుగా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ వ్యాప్తి ఆందోళనలకు కారణమైంది. అయితే, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుండి వచ్చిన ఒక ప్రయాణికుడికి సంబంధించిన అనుమానిత కేసులో వైరస్ నెగటివ్ అని తేలిందని గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్షేరియా ఇటీవల ధృవీకరించి భయాలను తొలగించారు.
ప్రజలు భయాందోళనలకు గురికావద్దని , ఎలాంటి వదంతులకు దూరంగా ఉండేందుకు ఆరోగ్య శాఖ అందించే సమాచారంపై ఆధారపడాలని మంత్రి కోరారు.
“కాంగో నుండి వచ్చిన ఎబోలా వైరస్ అంటువ్యాధికి సంబంధించిన అనుమానిత రోగి నివేదిక నెగటివ్గా వచ్చింది. పౌరులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, వదంతులకు దూరంగా ఉండాలని, ఆరోగ్య శాఖ అందించిన అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని విజ్ఞప్తి చేస్తున్నాము,” అని ఆయన అన్నారు.
ఎబోలా వ్యాప్తిపై తాజా సమాచారం ఇదే..
ప్రభావిత దేశాలలో సుమారు 80 మంది మరణించిన తరువాత, గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎబోలా వైరస్ వ్యాప్తిని “అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి” గా ప్రకటించింది . ఆ తరువాత మృతుల సంఖ్య 200 దాటింది.. వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి 1,077 అనుమానిత కేసులు నమోదయ్యాయి.
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాకు సంబంధించిన తన ప్రకటనలో, ఎబోలా ఇంకా మహమ్మారి అత్యవసర పరిస్థితికి సంబంధించిన ప్రమాణాలను అందుకోలేదని WHO స్పష్టం చేసింది. కానీ DR కాంగోతో సరిహద్దులు పంచుకుంటున్న దేశాలను అధిక ప్రమాదం గురించి హెచ్చరించింది.
అయితే, అప్పటి నుండి పరిస్థితులు చక్కబడినట్లు కనిపిస్తున్నాయి. బ్లూమ్బెర్గ్ తాజా నివేదిక ప్రకారం, వ్యాప్తి నెమ్మదిస్తుండవచ్చనే తాత్కాలిక సంకేతాలు కనిపించడంతో, ఎబోలా తీవ్రంగా ప్రభావితం చేసిన తూర్పు ప్రావిన్స్లోని ప్రధాన విమానాశ్రయాన్ని కాంగో తిరిగి తెరిచింది.
అయినప్పటికీ, వ్యాధి సోకిన వారి కాంటాక్టులను గుర్తించడం, అనుమానిత కేసులపై దర్యాప్తు చేయడం వంటి పోరాటం కొనసాగుతూనే ఉందని.. అక్కడి అధికార వర్గాలు తెలిపాయి.

