వేసవిలో కోళ్ల మరణాలు అధికంగా ఉండటం, సరఫరా తగ్గడంతో.. గుడ్ల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.. ఇటీవల భారీగా తగ్గిన గుడ్ల ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి.. అయితే.. గత రెండు వారాలుగా హైదరాబాద్లో గుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు, చిల్లర గిరాకీ తగ్గినా కోడి మాంసం ధరలు మాత్రం దాదాపు స్థిరంగా ఉన్నాయి.
ఇటీవల తగ్గినట్లే తగ్గిన గుడ్ల ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్లో కేవలం 15 రోజుల్లోనే గుడ్ల ధరలు భారీగా పెరిగాయి.. ఒక్కో గుడ్డుకు రూ.3 మేర ధర పెరిగింది. కొన్ని రోజుల్లోనే ఆకాశాన్నంటుతున్న గుడ్ల ధరలు వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. దాదాపు రెండు వారాల క్రితం ఒక గుడ్డు ధర రూ.4 ఉండగా, ఇప్పుడు రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర రూ.7 కి చేరింది. మరికొన్ని ప్రాంతాల్లో 8 రూపాయాలు సైతం అమ్ముతున్నారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా రిటైల్ కిరాణా దుకాణాలలో ధరలు ఒకే విధంగా ఉండగా, హోల్సేల్ దుకాణాలు ఒక్కో గుడ్డును రూ. 6.30 చొప్పున అమ్ముతున్నాయి.
కోళ్ల అధిక మరణాలు, ఉత్పత్తి తగ్గడం.. డిమాండ్ పెరగడం.. వేగంగా పెరుగుతున్న ధరలకు కారణమని కోళ్ల పెంపకందారులు పేర్కొంటున్నారు. “వేసవిలో, ఫారాలలో కోళ్ల మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. ఉత్పాదకత తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, గుడ్లు, కోళ్ల మాంసానికి డిమాండ్ అలాగే కొనసాగుతుంది. సరఫరా తక్కువగా ఉండటంతో, నష్టాలను పూడ్చుకోవడానికి ఫారాలలో గుడ్లు, కోళ్ల ధరలను పెంచుతారు.” అని రంగారెడ్డి జిల్లాలోని ఒక కోళ్ల ఫారం యజమాని తెలిపారు..
సంవత్సరంలోని ఇతర నెలలతో పోలిస్తే వేసవిలో మరణాల రేటు 30 శాతం ఎక్కువగా ఉంటుందని మరో పౌల్ట్రీ ఫారం యజమాని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, మార్కెట్లో కోడి మాంసం ధర కిలోకు రూ.240 ఉండగా, లైవ్ బర్డ్ (బతికున్న కోడి) కిలో రూ.170కి అమ్ముతున్నారు. హైదరాబాద్ లో కేజీ చికెన్ రూ.240 నుంచి రూ.260 వరకు అమ్ముతున్నారు. గత వారం కేజీ చికెన్ రూ.280 నుంచి 300వరకు అమ్మారు.
మల్లేపల్లిలోని చికెన్ షాప్ యజమాని మహ్మద్ నజీర్ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు కేవలం కొన్ని రూపాయలు మాత్రమే పెరిగాయని చెప్పారు. “వేసవిలో ప్రజలు వివిధ కారణాల వల్ల చికెన్ కొనడానికి దూరంగా ఉంటారు.. కాబట్టి చిల్లర అమ్మకాల డిమాండ్ తక్కువగా ఉంటుంది. హోటళ్లు, క్యాటరర్లకు జరిగే సాధారణ సరఫరాలకు ఎలాంటి ఆటంకం కలగలేదు,” అని నజీర్ అన్నారు.
కోళ్ల ఫారాలు రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మహబూబ్నగర్ జిల్లాల్లో అధికంగా ఉన్నాయి.
ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా ఎగుమతులు దెబ్బతినడంతో మార్చిలో గుడ్ల ధరలు తగ్గాయి. అయితే, అది స్వల్ప కాలం వరకే కొనసాగింది.. అయితే.. కొళ్ల మరణాలు.. డిమాండ్ పెరగడం వల్ల.. మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ ఓనర్స్ పేర్కొంటున్నారు.

