మరో 4 రోజుల్లోనే జేఈఈ మెయిన్‌ తుది విడత ఫలితాలు.. ఆల్‌ ఇండియా ర్యాంకులు ఎప్పుడంటే?

మరో 4 రోజుల్లోనే జేఈఈ మెయిన్‌ తుది విడత ఫలితాలు.. ఆల్‌ ఇండియా ర్యాంకులు ఎప్పుడంటే?

జేఈఈ మెయిన్‌ 2026 సెషన్ 2 పరీక్షల ఫలితాలు మరో 4 రోజుల్లో విడుదలకానున్నాయి. ఇప్పటికే ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేసిన ఎన్టీయే తుది ఆన్సర్‌ కీ విడుదల చేసి, ఆపై వెనువెంటనే ఫలితాలను కూడా విడుదల చేయనుంది. షెడ్యూల్‌ ప్రకారం జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు..

దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2026 సెషన్ 2 పరీక్షల ఫలితాలు మరో 4 రోజుల్లో విడుదలకానున్నాయి. ఇప్పటికే ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేసిన ఎన్టీయే తుది ఆన్సర్‌ కీ విడుదల చేసి, ఆపై వెనువెంటనే ఫలితాలను కూడా విడుదల చేయనుంది. షెడ్యూల్‌ ప్రకారం జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు ఏప్రిల్ 20వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఎన్టీయే ఏర్పాట్లు చేస్తుంది. ఐఐటీల్లో బీటెక్‌ ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఇది అర్హత పరీక్ష. దీంతో దేశ వ్యాప్తంగా ఈ పరీక్షకు డిమాండ్‌ కాస్త ఎక్కువగానే ఉంటుంది. జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్షలకు దాదాపు 11.23 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. తొలి విడతలోనూ 14 లక్షలకుపైగా అభ్యర్ధులు పోటీపడ్డారు.

కాగా జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్షలు ఏప్రిల్ 8తో ముగిసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 11న విడుదల చేసిన ఆన్సర్ కీపై వచ్చిన అభ్యర్ధలను పరిశీలించి తుది ఆన్సర్ కీ రూపొందించి, ఫలితాలు ప్రకటిస్తారు. జేఈఈ మెయిన్‌ రెండు సెషన్లలో అభ్యర్థులు సాధించిన అత్యుత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకుని, నార్మలైజేషన్ పద్ధతిలో తుది ర్యాంకులను ఏప్రిల్ 20న ప్రకటిస్తారు. ఈ ర్యాంకుల ఆధారంగానే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హతను నిర్ణయిస్తారు. తొలి 2.50 లక్షల ర్యాంకులను జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అనుమతిస్తారు.

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే ఈఈ అడ్వాన్స్‌డ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. అంటే ఏప్రిల్ 21 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. మే 2వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. అడ్మిట్‌ కార్డులు మే 11 నుంచి మే 17 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక మే 17న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు ఒకే రోజులో నిర్వహిస్తారు. అభ్యర్ధులు రెండు పేపర్లకు తప్పనిసరిగా హాజరుకావల్సి ఉంటుంది. అనంతరం జోసా కౌన్సెలింగ్‌ జూన్‌ 2 నుంచి మొదలవుతుంది. అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన వారికి ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఏఏటీ 2026) రాసేందుకు జూన్‌ 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏఏటీ 2026 పరీక్ష జూన్‌ 4వ తేదీ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. జూన్‌ 7న ఏఏటీ ఫలితాలు విడుదలవుతాయి.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు