ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన IIT, NIT, IIITలలో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు జోసా కౌన్సెలింగ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి..
దేశంలోని 23 ఐఐటీలతోపాటు NIT, IIIT, ఇతర ప్రముఖ విద్యాసంస్థల్లో బీటెక్ సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారం (జూన్ 2) ప్రారంభం కానుంది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి జోసా కౌన్సెలింగ్ పోర్టల్ ఓపెన్ కానుంది. ఈ మేరకు ఐఐటీ రూర్కీ కౌన్సెలింగ్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ ఏడాది జోసా కౌన్సెలింగ్ మొత్తం 5 విడతల్లో జరగనుంంది. తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 11 వరకు కొనసాగుతుంది. జూన్ 13న తొలి విడత సీట్లు కేటాయిస్తారు. అభ్యర్థులు ఆన్లైన్ రిపోర్టింగ్, ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల అప్లోడ్ జూన్ 13 నుంచి చేయవచ్చు. రౌండ్ 1 ఫీజు చెల్లింపులు జూన్ 26 వరకు చేయవచ్చు. ఇక జోసా రెండో విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు జూన్ 30న , జులై 6న మూడో విడత, జులై 10న నాలుగో విడత, జులై 16న చివరి విడత సీట్లను కేటాయిస్తారు. జులై 21తో కౌన్సెలింగ్ ప్రక్రియ ముగుస్తుంది.
కాగా JoSAA కౌన్సెలింగ్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి గాను 23 IITలు, IISc బెంగళూరు, 31 NITలు, IIEST శిబ్పూర్, 26 IIITలు , 56 జీఎఫ్టీఐ సంస్థలు (Other-GFTIs) సహా 138 సంస్థలలో ప్రవేశాలు కల్పిస్తారు. గత ఏడాది 128 విద్యా సంస్థలు జోసా పరిధిలో ప్రవేశాలు కల్పించాయి. ఐఐటీలు, ఐఐఎస్సిలో సీట్ల కేటాయింపు జేఈఈ (అడ్వాన్స్డ్) 2026 ర్యాంక్ ఆధారంగా జరుగుతుంది. ఎన్ఐటీల్లో సీట్ల కేటాయింపు జేఈఈ (మెయిన్) 2026 ర్యాంక్ ఆధారంగా జరుగుతుంది. జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్లందరికీ జోసా (JoSAA) కౌన్సెలింగ్లో సీట్లు కేటాయిస్తారు.
జోసా (JoSAA) కౌన్సెలింగ్ ద్వారా ఈ ఏడాది మొత్తం 62 వేల ఇంజనీరింగ్ సీట్లను భర్తీ చేయనుంది. వీటిలో 23 ఐఐటీలలో సుమారు 18,160 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

