టోల్ ఫీజులు ఏప్రిల్ 1 నుంచి తగ్గనున్నాయి. హైదరాబాద్-విజయవాడ హైవేపై ధరలు స్వల్పంగా తగ్గాయి. కొత్త టోల్ ఛార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. కొన్ని రకాల వాహనాలపై ఛార్జీలు తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కొత్త రేట్లు ఇవే..
తెలుగు రాష్ట్రాల వాహనదారులకు భారీ శుభవార్త. తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలకు హైదరాబాద్-విజయవాడ హైవే కీలకంగా ఉంది. తరచూ లక్షలాది మంది ఈ హైవే ద్వారా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక పండుగ సమయాల్లో అయితే ప్రయాణికుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీకి ఈ హైవే కీలకంగా మారింది. ఈ క్రమంలో వాహనదారులకు ఊరట కలిగించే విధంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. టోల్ ఫీజులను స్వల్పంగా తగ్గించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త టోల్ రుసుంలు అమల్లోకి రానున్నాయి. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత అమల్లోకి రానున్న కొత్త టోల్ ఫీజుల గురించి వివరంగా తెలుసుకుందాం.
రూ.5 చొప్పున టోల్ తగ్గింపు
హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే 65పై టోల్ ఛార్జీలను తగ్గించారు. పలు రకాల వాహనాలపై రూ.5 చొప్పున తగ్గించేందుకు అధికారులు సిద్దమయ్యారు. పంతంగి కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద టోల్ ఛార్జీలు తగ్గించనున్నారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద 3 యాక్సిల్ కమర్షియల్ వెహికల్స్కు రూ.5 తగ్గనుండగా.. ఒకవైపు ప్రయాణానికి ప్రస్తుతం రూ.290గా ఉండగా.. ఇప్పుడు రూ.285కి తగ్గనుంది. ఇక ఇరువైపుల ప్రయాణానికి ప్రస్తుతం రూ.435 ఉండగా.. ఇప్పుడు రూ.430కి తగ్గుముఖం పట్టింది. 24 గంటలకు ఈ టోల్ ఫీజు వర్తిస్తుంది. ఇక కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద 3 యాక్సిల్ కమర్షియల్ వాహనాలకు సింగిల్ ప్రయాణానికి రూ.450 నుంచి రూ.445కి తగ్గించారు. ఇక రెండు వైపుల ప్రయాణానికి రూ.675 నుంచి రూ.670కి తగ్గుముఖం పట్టింది.
కొత్త రేట్లు ఇవే..
ఇక వ్యాన్, కారు, జీపు, లైట్ మోటార్ వెహికల్స్కు పంతంగి టోల్ గేట్ వద్ద ఒకవైపుకు రూ.80, రెండు వైపుల ప్రయాణానికి రూ.115 ఉంది. ఇక కొర్లపహాడ్ వద్ద ఒకవైపుకు రూ.120, రెండు వైపులకు రూ.180 ఉంది. ఇక లైట్ గూడ్స్, మినీ బస్సు, లైట కమర్షియల్ వెహికల్స్కు సింగిల్ ప్రయాణానికి రూ.265, రెండు వైపులకు రూ.395కి చేరుకుంది. ఇక కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద ఒకవైపుకు రూ.195, రెండు వైపులకు రూ.250గా ఉంది. అలాగే 2 యాక్సిల్ బస్సు,ట్రక్కుకు పంతంగి టోల్ ప్లాజా వద్ద ఒకవైపుకు రూ.265, రెండు వైపులకు రూ.395గా ఉంది. ఈ రేట్లు రేపటి నుంచి వర్తిస్తాయని, ప్రయాణికులు గమనించాలని ఎన్హెచ్ఏఐ అధికారులు స్పష్టం చేశారు.

