జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ.. తుని పోలీసుల కీలక ప్రకటన..

జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ.. తుని పోలీసుల కీలక ప్రకటన..

కాకినాడ జిల్లా తునిలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై 26 రోజులు గడిచినా ఆచూకీ లభించలేదు. 12 ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలించినా ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. చిన్నారి జాడ తెలిపిన వారికి రూ.1 లక్షల నగదు బహుమతి ప్రకటిస్తూ, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తుని పోలీసులు వెల్లడించారు.

కడుపున పుట్టిన బిడ్డ ఓ గంట కనిపించకపోతే అల్లాడిపోతాం.. అలాంటిది 26 రోజులుగా బిడ్డ ఆచూకీ తెలియకపోతే… ఆ తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం.. కాకినాడ జిల్లా తునిలోని సీహెచ్ అగ్రహారంలో కనిపించకుండా పోయిన రెండేళ్ల జాహ్నవి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. పెద్ద ఎత్తున అధికారులను రంగంలోకి దించినా… డ్రోన్ల సాయంతో సెర్చింగ్‌ ముమ్మరం చేసినా పాప జాడ దొరకలేదు.. ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా వెతకడంతోపాటు.. సాంకేతికంగా అన్ని కోణాల్లో విచారించినప్పటికీ.. ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.. చిన్నారి జాహ్నవి అదృశ్యమై 26 రోజులు గడిచినా ఇప్పటికీ ఎలాంటి క్లూ లభించలేకపోవడంతో.. కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. దాదాపు 12 బృందాలతో గాలింపు చేపట్టినప్పటికీ.. ఎలాంటి ఆధారం లభించలేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే.. కాకినాడ, తుని పోలీసులు కీలక ప్రకటన చేశారు.

చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి (జాహ్నవి) చిత్రంతో కూడిన గోడపత్రికను చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు రాష్ట్రంలోని పలు కీలక జిల్లాల్లో వీటిని అతికించారు. చిన్నారి సమాచారం తెలిపిన వారికి రూ.లక్ష పారితోషికం ఇస్తామని ప్రకటించారు. చిన్నారి జాడ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ఎవరికైనా తెలిస్తే.. 9440796508, 9440796531, 9440796573కు సమాచారం ఇవ్వాలని తుని రూరల్‌ సీఐ చెన్నకేశవరావు కోరారు. మరోవైపు చిన్నారి జాహ్నవి కోసం తల్లిదండ్రులు రోజురోజుకూ ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డ క్షేమంగా తిరిగి రావాలని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.

అసలేం జరిగిందంటే..
కాగా.. జూన్ 6వ తేదీన మధ్యాహ్నం 11.50 గంటల సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.. పాపతో పాటు పెంపుడు శునకం కూడా అదృశ్యమైంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ శునకం తిరిగి ఇంటికి చేరినప్పటికీ, పాప ఆచూకీ లభించలేదు. ఆ తర్వాత శునకం కూడా మృతి చెందింది.. అయితే.. పాప కనిపించకుండా పోయిన రోజు, ఆ శునకం ఊరిలోని ప్రధాన రహదారిపై ఆందోళనగా తిరుగుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. కానీ, అది ఎటువైపు వెళ్లిందనే దానిపై పూర్తిగా స్పష్టత రాలేదు. ఆ తర్వాత.. వందలాది మంది సిబ్బంది గాలించినా ఆచూకీ దొరకలేదు. దాదాపు నెల రోజులు కావస్తున్నా పాప ఆచూకీ లభించకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు