ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల పాలనలో కొత్త అధ్యాయం మొదలైంది. AP పంచాయతీల రూపురేఖలు మారిపోయాయి. పల్లెల్లో ఐదేళ్ల పాలన ముగిసింది. శుక్రవారం (ఏప్రిల్ 03) నుంచి విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అంతా అధికారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అసలు ఈ స్పెషల్ ఆఫీసర్ల రూల్ ఏంటి? ఇంతకీ ఎన్నికలు ఎప్పుడు ఉండొచ్చు?
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల పాలనలో కొత్త అధ్యాయం మొదలైంది. ఊరూరా సందడి చేసిన సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 వేల 100 పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను అమలుచేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు కేసులు ఉన్న మరో 250 పంచాయతీలు మినహా.. రాష్ట్రమంతటా ఇప్పుడు అధికారుల రాజ్యాంగం నడుస్తోంది. పంచాయతీరాజ్ చట్టం-1994, సెక్షన్ 143(3) ప్రకారం ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించింది.
ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఈవోలు, ఎంఈవోలకు కీలక బాధ్యతలు కట్టబెట్టారు. సర్పంచ్ పదవి ముగియడంతో గ్రామాల్లో చెక్ పవర్ ఇప్పుడు అధికారుల వద్దకు చేరింది. అభివృద్ధి పనుల నిధులు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి అత్యవసర సేవల బాధ్యతను కలెక్టర్లు నియమించిన మండల స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలతో పాటు ఈవోలు గ్రామాల్లో ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు చేపడుతున్నారు. అధికారుల పాలనలో పనులు సకాలంలో జరుగుతాయా అన్న ఆందోళన గ్రామాల్లో వ్యక్తమవుతోంది.
మరోవైపు అందరి కళ్లు ఇప్పుడు ఎన్నికల కమిషన్ వైపే ఉన్నాయి. పదవీకాలం ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరుగుతోంది. ఓటర్ల జాబితా సవరణ, వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆరు నెలల్లోగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటివరకు పల్లెల్లో ‘స్పెషల్’ పాలనే సాగనుంది.

