గద్వేల్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త ట్విస్ట్లు బయటపడ్డాయి. తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు అరెస్టు అయ్యారు. తిరుమలరావు, ఐశ్వర్య కలిసి 75 వేల రూపాయలకు సుపారీ ఇచ్చి తేజేశ్వర్ను హత్య చేయించారని పోలీసులు తెలిపారు. ఐశ్వర్యకు తిరుమలరావుతో గతంలో సంబంధం ఉండేదని, తేజేశ్వర్ను హత్య చేసి తిరుమలరావుతో పారిపోవాలని ఐశ్వర్య ప్లాన్ చేసిందని దర్యాప్తులో తేలింది.
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు, ఊహించని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ కేసులో ప్రధాని నిందితుడైన బ్యాంక్ మేనేజర్ తిరుమలరావును పోలీసులు బుధవారం శంషాబాద్ ఎయిర్ఫోర్ట్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గద్వేల్కు చెందిన సర్వేయర్ తేజేశ్వర్ను పెళ్లైన నెల రోజులలోపే భార్య ఏకంగా ఐదు సార్లు హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఫైనల్గా ఆరోసారి ఆమె అనుకున్నది సాధించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన తేజేశ్వర్ భార్య ఐశ్వర్య.. నెల రోజుల క్రితం తేజేశ్వర్ను ప్రేమ వివాహం చేసుకుంది. కానీ, అంతకంటే ముందు ఐశ్వర్యకు కర్నూల్లోని ఓ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్న తిరుమలరావు అనే వ్యక్తితో సంబంధం ఉంది. తిరుమలరావు పనిచేసే బ్యాంక్లో ఐశ్వర్య తల్లి పనిచేసేది.
ఈ క్రమంలోనే ఆమెకు, బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుకు శారీరక సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత తిరుమలరావుకు ఐశ్వర్యతో కూడా పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తిరుమలరావుకి అప్పటికే వివాహం అయినా అతనికి పిల్లలు లేరు. దీంతో.. ఐశ్వర్యను రెండో వివాహం చేసుకోవాలని తిరుమలరావు భావించాడు. అందుకే ఐశ్వర్య కూడా ఒప్పుకుంది. ఇలా ఏకకాలంలో తల్లీ కూతుళ్లతో తిరుమలరావు సంబంధం కొనసాగించాడు. కానీ, గద్వేల్కు చెందిన సర్వేయర్ తేజేశ్వర్ను ఐశ్వర్య పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లైన కొన్ని రోజులకే తిరుమలరావుతో ఐశ్వర్య మళ్లీ టచ్లోకి వెళ్లింది. ఎలాగైనా తేజేశ్వర్ను వదిలించుకొని నీతో వచ్చేస్తానంటూ అతనికి చెప్పింది. దీంతో తిరుమలరావు, ఐశ్వర్య కలిసి తేజేశ్వర్ హత్యకు ప్లాన్ వేశారు. తిరుమలరావు తేజేశ్వర్ను హత్య చేసేందుకు కొంత మందికి 75 వేల సుపారీ ఇచ్చాడు. అతడి వద్ద డబ్బు తీసుకున్నవారిలో ప్రధాన నిందితుడైన మనోజ్ అనే వ్యక్తి. తేజేశ్వర్ సర్వేయర్ కావడంతో సర్వే పేరుతో అతణ్ని బయటకు తీసుకెళ్లాడు.
ఈనెల 17న తేజేశ్వర్ ను ల్యాండ్ సర్వే పేరుతో నగేష్, పరశురాం, రాజు అనే ముగ్గురు వ్యక్తులు ఇంట్లోంచి బయటకు పిలిచారు. కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ముందు సీట్లో కూర్చున్న తేజేశ్వర్ మెడ పట్టుకొని రాజు, పరశురామ్ కత్తితో పొడిచారని తెలిపారు పోలీసులు. ఆ తరువాత డ్రైవర్ సీట్లో ఉన్న నగేష్ తేజేశ్వర్ కడుపులో కత్తితో పొడిచాడన్నారు. చనిపోయిన తరువాత కర్నూలు శివారులో మృతదేహాన్ని పడేశారు. డెడ్బాడీని చూసిన తరువాత సుపారీ బ్యాచ్ కి రూ.2లక్షలు ఇచ్చాడు తిరుమలరావు. మర్డర్కు ముందు బ్యాంక్ నుంచి తిరుమలరావు రూ.20 లక్షల లోన్ తీసుకున్నాడు. ఆ హత్య తరువాత ఐశ్వర్యతో కలిసి లడఖ్ వెళ్లేందుకు తిరుమలరావు ప్లాన్ వేసుకున్నాడు. అయితే తేజేశ్వర్ కనిపించడం లేదంటూ అతని తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని.. తేజేశ్వర్ ఫోన్ లోకేషన్ ఆధారంగా గద్వేల్ పోలీసులు కర్నూల్కు వెళ్లి ఓ చెరువు వద్ద తేజేశ్వర్ మృతదేహాన్ని కనిపెట్టారు. మృతదేహంపై అమ్మ అనే పచ్చబొట్టు ఆధారంగా అది తేజేశ్వర్ మృతదేహంగా నిర్ధారించారు.
భార్యను చంపేందుకు తిరుమలరావు ప్లాన్..
ఐశ్వర్యతో పరిచయం తర్వాత, భార్యను చంపేందుకు కూడా తిరుమలరావు ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు పోలీసులు. తిరుమలరావుకు ఇప్పటికే పెళ్లయి 8ఏళ్లు అవుతోంది. సంతానం లేకపోవడంతో ఐశ్వర్యతో పిల్లల్ని కనాలని భావించాడు. లడఖ్ వెళ్లేందుకు హత్య జరిగిన రోజు తల్లికి ఫోన్ చేసి కొన్ని దుస్తులు తెప్పించుకుంది ఐశ్వర్య. ఈ కేసులో పోలీసులు 8మందిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా తిరుమల రావును శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తిరుమలరావును ప్రశ్నిస్తున్న పోలీసులు, సుపారీ గ్యాంగ్తో మర్డర్ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే పనిలో ఉన్నారు.
సోదరుడిని కూడా చంపారా?
ఐశ్వర్య సోదరుడు కొన్ని నెలల క్రితం ఇంట్లో జారిపడి మరణించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ప్రమాదవశాత్తు అతను కిందపడి మరణించాడని ఐశ్వర్య, అతని తల్లి చుట్టుపక్కల వారికి చెప్పారు. అయితే తిరుమలరావుతో తన తల్లి, సోదరి ఐశ్వర్య సన్నిహితంగా ఉండటం నచ్చని అతను వారిద్దరిని వారించినట్లు తెలుస్తోంది. ఆ కోపంతో వారిద్దనే అతన్ని చంపి, ప్రమాదవశాత్తు మరణించినట్లు ఏమైనా చిత్రీకరించారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదివింది పదో తరగతే కానీ..
ఈ కేసు నిందితురాలు ఐశ్వర్య చదివింది పదో తరగతే కానీ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండేదని సమాచారం. ఐశ్వర్య.. తిరుమలరావుతోపాటు మరికొందరితోనూ సంబంధాలు కొనసాగించినట్లు తెలుస్తోంది.