అన్నమయ్య జిల్లా రాజంపేట ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా 1.39.6 క్యారెట్ల ముడి వజ్రం లభించింది. దాత తనకు దొరికిన వజ్రాన్ని స్వామివారి అలంకరణకు వినియోగించాలని కోరారు. వజ్రాన్ని దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకుడికి అప్పగించారు.
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ హుండీ నుంచి 1.39.6 క్యారెట్ల ముడి వజ్రం బయటపడింది. అంతేకాకుండా వజ్రంతో పాటు ఒక ఉత్తరం కూడా లభించింది. ఆ ఉత్తరంలో దాత తనకు ఈ వజ్రం దొరికిందని, అది నిజమైనదని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే స్వామివారికి సమర్పిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ వజ్రాన్ని స్వామివారి అలంకరణ ఆభరణాల తయారీకి వినియోగించాలని కోరారు.
ఈ సమాచారం అందుకున్న దేవాదాయ శాఖ తనిఖీ అధికారి జనార్దన్, కార్యనిర్వహణాధికారి కొండారెడ్డిల సమక్షంలో వజ్రాన్ని ఆలయ ప్రధాన అర్చకుడు రవిస్వామి వద్దకు అప్పగించారు. ఈ సందర్భంగా అధికారులు దాత చేసిన ఆత్మీయ సమర్పణను ప్రశంసించారు. హుండీ లెక్కింపు పూర్తయిన అనంతరం ఈ వివరాలను అధికారికంగా ధృవీకరించారు. ఆలయానికి ఈ రకమైన సమర్పణలు స్వామివారి పట్ల భక్తుల విశ్వాసానికి దృఢత చేకూరుస్తున్నాయని దేవాదాయ శాఖ అధికారులు వ్యాఖ్యానించారు. కాగా 1.39.6 క్యారెట్ల ముడి వజ్రం విలువ.. దాని నాణ్యత ఆధారంగా, సుమారు రూ 70 లక్షలు నుండి రూ 2 కోట్లు ఉండే అవకాశం ఉందని వజ్రాల వ్యాపారులు చెబుతున్నారు.