టీమ్ఇండియా టీ20 ప్రపంచ కప్ 2024 విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో పెద్దగా రాణించని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) (76; 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు) ఫైనల్లో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ కీలక ప్రకటన చేశాడు. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ తనకు చివరి టీ20 అని కోహ్లీ తెలిపాడు.
‘‘ఇది నా చివరి టీ20 ప్రపంచ కప్. మేం సాధించాలనుకున్నది ఇదే. భారత్ తరఫున ఇదే నా చివరి టీ20. నేను ఈ ప్రపంచ కప్ గెలవాలని కోరుకున్నా. అది ఓపెన్ సీక్రెట్. ఒకవేళ వరల్డ్ కప్ సాధించకపోయినా రిటైర్మెంట్ ప్రకటించేవాడిని. తర్వాతి తరానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే నేను వెనక్కి తగ్గుతున్నా. ఐసీసీ టోర్నమెంట్ను గెలవడానికి మేము చాలా కాలం వేచి ఉన్నాం. రోహిత్ శర్మ 9 టీ20 ప్రపంచ కప్లు ఆడాడు. ఇది నాకు ఆరో ప్రపంచ కప్. ఈ వరల్డ్ కప్ విజయానికి రోహిత్ అర్హుడు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టంగా ఉంది. ఇది అద్భుతమైన రోజు’’ అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.
వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్ సాధించిన అతికొద్దిమంది భారత క్రికెటర్లలో కోహ్లీ ఒకడు. టీమ్ఇండియా 2011 వన్డే ప్రపంచ కప్ సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. కోహ్లీ 2010లో జింబాబ్వేపై టీ20 అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో మొత్తం 125 టీ20లు ఆడి 48.69 సగటుతో 4188 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 38 అర్ధ సెంచరీలు సాధించాడు.