భార్యపై ఉన్న అపారమైన ప్రేమతో కడపకు చెందిన ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అరుదైన నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్తో భార్య మరణించడంతో ఆమె సమాధి పక్కనే తనకు కూడా ముందుగానే సమాధి నిర్మించించుకున్నారు. మరణానంతరం తనను అదే ప్రదేశంలో ఖననం చేయాలని కుమార్తెలకు చెప్పడమే కాకుండా, అంత్యక్రియల కోసం ముందుగానే డబ్బులు కూడా ఏర్పాటు చేశారు. ఈ దంపతుల అన్యోన్య దాంపత్యం స్థానికంగా అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.
మూడుముళ్ళతోనే వారి బంధం ఉండి పోవాలని అనుకోలేదు.. చనిపోయిన తర్వాత కూడా చిరకాలం తనతోనే ఉండాలని భార్య చనిపోయిన తరువాత ఆమె సమాధి పక్కనే తనకు కూడా ముందస్తు సమాధిని ఏర్పాటు చేసుకున్నాడు ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి.. కడప జిల్లా చిన్న చౌక్ లోని కోపరేటివ్ కాలనీకి చెందిన పి రామ్మోహన్ రాజు, రాజ్యలక్ష్మి దంపతులకు 1978లో వివాహమైంది. పిఎఫ్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేసిన రామ్మోహన్ రాజు ఏపీ వైద్య విద్య సహాయ సంచాలకులుగా కూడా పనిచేశారు. వీరికి నలుగురు కుమార్తెలు.. అయితే 2011లో భార్య రాజ్యలక్ష్మి క్యాన్సర్ బారినపడి చనిపోవడంతో ఆయన బిడ్డలే ఆవిడ పాడె మోసి ఖననం చేశారు..
అయితే.. భార్యపై ఉన్న అన్యోన్యతతో ఆమెను విడిచి ఉండలేక భార్యను ఖననం చేసి సమాధి కట్టిన ప్రదేశం పక్కనే తనకు కూడా స్థలం కేటాయించాలని స్మశానవాటిక నిర్వహాకులను సంప్రదించాడు రామ్మోహన్ రాజు.. తన భార్య సమాధి పక్కనే కొంత స్థలం కేటాయిస్తే తాను కూడా మందస్తు సమాధి కట్టుకుంటానని విన్నవించుకున్నాడు.. దీనికి స్మశానవాటిక నిర్వాహకులు.. అంగీకరించడంతో రామ్మోహన్ రాజు తన సమాధిని నిర్మించుకున్నారు.
అంతే కాకుండా ఆయన కుమార్తెలను కూడా ఒప్పించి తన మరణానంతరం తనను అక్కడే సమాధి చేయాలని తన పెన్షన్ లో నుంచి నాలుగు లక్షల రూపాయలను వారికి ఇచ్చారు. అంతేకాకుండా తాను చనిపోయిన తర్వాత అంత్యక్రియలు అంగరంగ వైభవంగా వేడుకగా జరగాలని 50వేల రూపాయలను తన స్నేహితులకు ముందుగానే ఇచ్చారంట రామ్మోహన్ రాజు.. భార్యపై ఎనలేని ప్రేమ.. అలాగే అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా రామ్మోహన్ రాజు నిలిచారని స్థానికులు పేర్కొంటున్నారు.

