బంగారం, వెండిపై పెరిగిన సుంకాలు.. సామాన్యుడిపై ప్రభావం ఎలా ఉండబోతుంది!

బంగారం, వెండిపై పెరిగిన సుంకాలు.. సామాన్యుడిపై ప్రభావం ఎలా ఉండబోతుంది!

ఇటీవల హైదరాబాద్‌ సభలో బంగారం కొనొద్దు అని మోదీ ఎందుకు అన్నారని అందరూ తలలు పట్టుకున్నారు. కట్‌చేస్తే ఆ మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే తాజాగా వినియోగదారులకు షాక్‌ కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి, ప్లాటినమ్‌పై సుంకాన్ని పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

బంగారం కొనకండి అంటూ ప్రధాని మోదీ మొన్న ఆదివారం సికింద్రాబాద్‌ సభ వేదికగా యావత్‌ దేశానికి పిలుపునిచ్చారు. ఏడాదిపాటు పెళ్లిళ్ల సందర్భంగా బంగారం కొనుగోలు చేయకూడదని సూచించారు. దిగుమతి వస్తువుల వాడకం తగ్గించినా, ఆపేసినా, అది దేశభక్తి అవుతుందంటూ మోదీ చెప్పారు. కానీ మోదీ అలా ఎందుకు అన్నారో అప్పుడు ఎవరీ అర్థం కాలేదు. కొందరు మాత్రం రాబోయే రోజుల్లో ధరలు పెరగొచ్చు అన్నారు. వాళ్లు అనుకున్నట్టే జరింది. ప్రధాని మోదీ బంగారంపై ఇచ్చిన హింట్‌ ఇచ్చిన రెండురోజులకే గోల్డ్‌ మీద 9 శాతం అదనపు సుంకాల భారం పడింది.

దేశీయ అవసరాల కోసం దిగుమతి చేసుకునే విలువైన లోహాలపై కేంద్ర ఆర్థిక శాఖ అదనపు సుంకాన్ని విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 5 శాతం మేర పెంచుతున్నట్టు ప్రకటించింది. దీనితో గతంలో ఉన్న 6 శాతం సుంకం కాస్తా ఇప్పుడు 15శాతానికి చేరింది. ఇక ప్లాటినం పై 5.4 శాతం అదనపు సుంకాన్ని విధిస్తూ కేంద్ర ఆర్థికశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.

సుంకాల పెంపుతో సామాన్యుడిపై భారం

పశ్చిమాసియా ఉద్రిక్తల నేపథ్యంలో ఇప్పటికే బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక తాజాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 9 శాతం అదనపు సుంకం పెంచడంతో గోల్డ్‌ ధరలు మరించి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర లక్షా 53వేల 990రూపాయలుగా ఉండగా 9 శాతం అదనపు సుంకం కలుపుకుంటే ఈ ధర మరో రూ.14వేలు పెరుగుతుంది. అంటే కొత్త సుంకంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,67,990కి చేరే సూచనలు కనిపిస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువను కాపాడటానికి, వాణిజ్య లోటును తగ్గించడానికి కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా, పెళ్లిళ్ల సీజన్‌లో ఉన్న సామాన్యులకు ఈ ధరల పెరుగుదల గొడ్డలి పెట్టులా మారింది.

Please follow and like us:
బిజినెస్ వార్తలు