టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన ట్రెండ్ సెట్టర్ దర్శకుడు. హీరో పాత్రలను రఫ్గా, మాస్గా, పవర్ఫుల్ డైలాగ్స్తో ఆవిష్కరించడం ఆయన ప్రత్యేక శైలి. 25 ఏళ్లకు పైగా సినీ రంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. అయితే కొన్నాళ్లుగా పూరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోవడం లేదు. ఈ క్రమంలో తాజాగా సీనియర్ ఎడిటర్ వెంకటేశ్ పూరితో తనకున్న అనుబంధం గురించి చెసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
ప్రముఖ సినీ ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్, దర్శకుడు పూరి జగన్నాథ్ తో తన అనుబంధం, ఆయన సినిమాలపై తన విశ్లేషణను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆంధ్రావాలా చిత్రం విషయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ, సినిమా విడుదలకు ముందే పూరి జగన్నాథ్ కి ఆ సినిమా తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం నచ్చలేదని స్పష్టంగా చెప్పినట్లు వెంకటేష్ తెలిపారు. ఎన్టీఆర్ యువ పాత్ర అద్భుతంగా ఉన్నప్పటికీ, పెద్దాయన పాత్రలో ఆయన కనిపించడం ఆడియన్స్ కు కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చని, అది సినిమా ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉందని తాను అంచనా వేసినట్లు వివరించారు. పూరి జగన్నాథ్ తన అభిప్రాయాన్ని ఎప్పుడూ సానుకూలంగా స్వీకరించారని, వ్యక్తిగతంగా ఎప్పుడూ బాధపడలేదని వెంకటేష్ అన్నారు. పూరి జగన్నాథ్ తో తనకు ఆర్థికపరమైన విభేదాల కారణంగా గ్యాప్ వచ్చిందనే పుకార్లపై కూడా మార్తాండ్ కే వెంకటేష్ స్పందించారు.
ఇటీవల పూరి జగన్నాథ్ పోకిరిలో ఏముందని తాను రెండుసార్లు చూసుకున్నానని, తన సినిమాలు ఎందుకు ఆడట్లేదో తెలియట్లేదని వచ్చిన ఈ మాట విషయంపై కూడా మార్తాండ్ కే వెంకటేష్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పూరి జగన్నాథ్ టచ్ లేదా స్పార్క్ మిస్ అవ్వడానికి గల కారణాలను వివరిస్తూ, ఆయన ఎడిటింగ్కు కూర్చున్నప్పుడు కథ తెలిసిన వ్యక్తి కాబట్టి వేగంగా ట్రిమ్ చేస్తారని చెప్పారు. ఇది అక్కర్లేదు, అది అక్కర్లేదు అని చాలా సన్నివేశాలను తీసేస్తుంటారని తెలిపారు. మిగతా డైరెక్టర్లు ఉంచమంటే, పూరి మాత్రం తీసేయమని అంటారని వెంకటేష్ పేర్కొన్నారు. ఆయన్ని ఎడిటర్లు అడ్డుకోవాలని, ప్రేక్షకుల అవగాహన కోసం కొన్ని కీలక సన్నివేశాలను ఉంచమని చెప్పాలని ఆయన సూచించారు.
పోకిరి చిత్రంలో కామెడీ ట్రాక్ వద్దని పూరి జగన్నాథ్ అన్నప్పుడు తాను దాన్ని నిలిపివేయమని చెప్పిన విషయాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. పూరి జగన్నాథ్ అతి వేగవంతమైన ట్రిమ్మింగ్ కొన్నిసార్లు మైనస్ అవుతుందని, ఎడిటర్లు సరైన సమయంలో ఆయన్ని నిలువరించడం అవసరమని మార్తాండ్ కే వెంకటేష్ తన వ్యక్తిగత అభిప్రాయంగా వెల్లడించారు.

