హైదరాబాద్ వాసులను నేపాలీ గ్యాంగ్ వణికిస్తుంది. ఇంట్లో పనిమనుషుగా చేరి కొన్నాలకు ఆ ఇళ్లకే కన్నాలు వేస్తున్న ఈ గ్యాండ్ ఓనర్ల గుండెల్లో గుబులు పెట్టిస్తుంది. ఇటీవల మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు మరువకముందే, మరోసారి నేపాలీ గ్యాంగ్ రెచ్చపోయింది. పనిమనుషుల రూపంలో ఇంట్లో అడగుపెట్టిన ముఠా మాజీ ప్రొఫెసర్ దంపతులను బంధించి, ఇంట్లో ఉన్న నగలు, నగదు దోచుకెళ్లింది. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
హైదరాబాద్ నగరంలో నేపాలి గ్యాంగ్ ఆడగాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత 4 రోజుల క్రితం మాజీ ఐపీఎస్ భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన ఉదంతం మరువక ముందే మరో నేపాలి గ్యాంగ్ అరాచకం వెలుగులోకి వచ్చింది. కౌకూరులోని గోల్ఫ్ ఎన్క్లేవ్లో నివాసముంటున్న రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మి దంపతుల ఇంట్లో కొంతకాలంగా పనిమనుషులుగా ఉన్న ఓ నేపాలీ జంట మరికొందరితో కలిసి ఓనర్స్ను బంధించి ఇంట్లో ఉన్న బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో కొంతకాలంగా ఒక నేపాలీ జంట పనిమనుషులుగా ఉంటున్నారు. ఇటీవల వారి బంధువుగా చెబుతూ మరో మహిళ కూడా ఆ ఇంట్లో చేరింది. సోమవారం రాత్రి సదరు మహిళ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటామని ప్రొఫెసర్ను అనుమతి కోరారు. వారిని నమ్మిన ప్రొఫెసర్ దంపతులు అందుకు అంగీకరించారు. ఇక ముందే చేసుకున్న ప్లాన్ ప్రకారం.. వేడుకల నెపంతో ఆ నేపాలీ ముఠా మరో ముగ్గురు వ్యక్తులను రహస్యంగా ఇంట్లోకి రప్పించింది. దంపతులు భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వారిపై దాడి చేసి వారిని బంధించింది.
అయితే ఇంటి యజమానులు వారిని ఒదిలేయాలని వేడుకున్నారు. మీకు కావాల్సింది తీసుకెళ్లండి కానీ మమ్మల్ని మాత్రం చంపకండి అని బాధితులు ప్రాధేయపడటంతో వారికి మత్తు మందు ఇచ్చి ఓ రూమ్లో బంధించారు. అనంతరం ఈ గ్యాంగ్ ఇంట్లో ఉన్న 60 తులాల బంగారం, వెండి, 30 వేలు నగదు తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు. ఇక మరుసటి రోజు మత్తు దిగిన తర్వాత బాధితులు కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వచ్చి తలుపులు పగులగొట్టి వారిని రక్షించారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి డీసీపీ వివరాలు సేకరించారు. ఈ దోపిడీలో మొత్తం ఏడుగురు పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు.

