ఆంధ్రప్రదేశ్లో సీఎంతో పాటు వీఐపీలు జిల్లాల పర్యటనలకు ఉపయోగించే హెలికాప్టర్లో తరచూ సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎక్కిన వెంటనే మరోసారి ఈ హెలికాప్టర్లో సాంకేతికలోపం తలెత్తింది. గమనించి అప్రమత్తమైన పైలట్ వెంటనే కిందకు దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఆంధ్రప్రదేశ్లో సీఎంతో పాటు వీఐపీలు జిల్లాల పర్యటనలకు ఉపయోగించే హెలికాప్టర్లో తరచూ సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర కలకలం రేపుతోంది. తాగాజా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ ఈ ఉదయం తిరుమలలో స్వామివారి దర్శనం ముగించుకుని, తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇక ఆయన ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు అధికారులు సీఎం, ఇతర ప్రముఖులు వినియోగించే రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్ను సిద్ధం చేశారు. ఇక బయల్దేరేందుకు సిద్ధమైన మంత్రి హెలికాప్టర్ ఎక్కారు. హెలికాప్టర్ గాల్లోకి ఎగిరే తరుణంలోనే అందులో సాంకేతిక లోపం తలెత్తింది. గమనించిన పైలట్ అప్రమత్తమై వెంటనే ATC అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే హెలికాప్టర్ని ఆపివేశారు. దీంతో కృష్ణపట్నం పర్యటనను రద్దు చేసుకుని పీయూష్ గోయల్ ఢిల్లీ వెళ్ళిపోయారు.
అయితే వీఐపీలు ప్రయాణించే ఈ హెలికాఫ్టర్ ఇలా ఇబ్బంది పెట్టడం ఇదే మొదటిసారి ఏం కాదు. ఇంతకు ముందు సీఎం పర్యటనల్లోనూ ఈ హెలికాప్టర్లో ఇలాగే కొన్ని సార్లు సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు తెలుస్తోంది. వీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్లో ఇలా తరచూ లోపాలు రావడం అధికార యంత్రాంగం చిత్తశుద్ధిని ప్రశ్నార్థకంగా మారుస్తోంది.
అయితే, ఇలా హెలికాప్టర్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంపై రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సీరియస్గా అయ్యారు. హెలికాప్టర్ సాంకేతిక లోపాలు, భద్రతా సమస్యలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్కి ఆదేశాలు జారీ చేశారు. ఈ హెలికాప్టర్ని వీఐపీ ప్రయాణాలకు వాడొచ్చా, వద్దా అన్న విషయంపై సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఈ ఘటనతో, వీఐపీల ప్రాణాలు ప్రమాదంలో పడకుండా చూసుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇకపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. కచ్చితంగా తనిఖీలు చేసి, ప్రతి హెలికాప్టర్ సురక్షితంగా ఉందా అని చూసి గాని ప్రయాణాలు జరగకూడదని వారు హెచ్చరిస్తున్నారు.