పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్రం స్పందించింది. ముడి చమురు ధరలు యద్ద సమయంలో బ్యారెల్కు 120 డాలర్లకుపైగా చేరుకున్నాయి. కానీ ఉద్రిక్తలు తగ్గిన తర్వాత 100 డాలర్లకు దిగొచ్చాయి. త్వరలో 80 డాలర్ల వరకు చేసుకోవచ్చనే అంచనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇంధన ధరలు తగ్గుతాయా..?
పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం జరగడం, యుద్దానికి ముగింపు పలకడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇరాన్తో శాంతి ఒప్పందం చేసుకుంటున్నట్లు గత కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అప్పటినుంచి క్రూడ్ ఆయిల్ ధరలు క్రాష్ అవుతున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుతాయనే వార్తలు వస్తున్నాయి. వాహనదారులు కూడా ధరలు దిగొస్తాయోమోనని భావిస్తున్నారు. అలాంటివారికి నిరాశ ఎదురైంది. ఇంధన ధరల తగ్గింపు వార్తలపై కేంద్రం ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది.
ధరలు తగ్గుతాయా..?
పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గించేది లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు పెట్రోలియం, సహజవాయువు సహాయమంత్రి సురేశ్ గోపీ ప్రకటన చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒకేసారి భారీగా తగ్గడంతో.. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుతాయనే వార్తలపై స్పందించారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా భారత్లో వెంటనే ఇంధన ధరలను తగ్గించలేమని తెలిపారు. ఇంధన ధరలను లీటర్పై రూ.3.94 మాత్రమే పెంచామని చెప్పారు. హర్ముజ్ జలసంధి తెరుచుకున్నా.. ఆ మార్గంలో నౌకల రద్దీ కొన్ని రోజుల పాటు ఎక్కువగా ఉంటుందన్నారు. తక్కువ ధరకే లభించే ముడి చమురు భారత్కు వచ్చేందుకు కొన్ని రోజుల సమయం పడుతుందని, దీని వల్ల భారత్లో ధరలు ఇప్పుడే తగ్గవన్నారు. యుద్దం వల్ల ఆయిల్ కంపెనీలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని, కోలుకునేందుకు కొంత సమయం పడుతుందన్నారు. సంక్షోభ పరిస్థితుల్లో ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించేందుకు ఏ రాష్ట్రం ముందుకు రాలేదని, దీని వల్ల భారం మొత్తం కేంద్రంపైనే పడిందని సురేశ్ గోపీ తెలిపారు. ఈ కారణంగానే కేంద్రం రూ.12 వేల కోట్ల ఆదాయం కోల్పోయిందని పేర్కొన్నారు.
గత నెలలో ధరల పెంపు
గత నెలలో కేంద్రం నాలుగుసార్లు ఇంధన ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. విడతల వారీగా పెట్రోల్, డీజిల్పై రూ.7 మేర పెంచింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో ధరలు తక్కువగా ఉన్నాయని, దేశంలో స్వల్ప మొత్తంలోనే పెంచినట్లు స్పష్టం చేసింది. దీంతో అన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటింది. కొన్ని రాష్ట్రాల్లో రూ.110 వరకు ఉంది. అయితే ఇంధన కొరత ఏర్పడనుందనే వార్తల క్రమంలో వాహనదారులు బంకుల వద్ద క్యూలు కట్టారు. కానీ అలాంటి కొరత ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

