మెగాస్టార్ చిరంజీవి, నయనతార నటించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’.. ఫిబ్రవరి 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠి, బెంగాలి భాషల్లో అందుబాటులోకి రానుంది.
ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ను సాధించిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ఇప్పుడు డిజిటల్లో సందడి చేయటానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ మాధ్యమం జీ5లో ఫిబ్రవరి 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. చిరంజీవి, నయనతార జంటగా నటించిన ఈ చిత్రం ఈ సీజన్లో విడుదలైన చిత్రాలన్నింటిలో అతి పెద్ద బ్లాక్ బస్టర్గా నిలవగా దీని డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఇప్పటికే సంక్రాంతికి ప్రకటించినట్లుగా జీ5లో అందుబాటులో ఉన్న అన్నీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులతో పాటు దక్షిణాసియా ప్రేక్షకులను కూడా మెప్పించనుంది.
మన శంకర వర ప్రసాద్ గారు సినిమాకు అనీల్ రావిపూడి రైటర్, డైరెక్టర్. మెగాస్టార్ చిరంజీవి పవర్ఫుల్ రోల్లో కథానాయకుడిగా మెప్పించారు. ఆయనతో పాటు వెంకటేశ్ దగ్గుబాటి, నయనతార, క్యాథరిన్ ట్రెసా తదితరులు ఇతర పాత్రల్లో అలరించారు. బలమైన ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాతో పాటు మంచి యాక్షన్ను కూడా కలగలిపి సీట్ ఎడ్జ్ డ్రామాగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రూపొందించారు. ఓ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (చిరంజీవి) తనకు దూరమైన కుటుంబాన్ని కాపాడుతూ ప్రేమ, బాధ్యతతో చేసే ప్రయాణంగా ఈ సినిమాలో చూపించారు. చిరంజీవికున్న గొప్ప తిరుగులేని సినీ లెగసీకి దేశ వ్యాప్తంగా నయనతార గ్లామర్ అప్పీల్ తోడు కావటంతో థియేటర్స్లో సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సందర్భంగా..
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ మన శంకర వర ప్రసాద్ గారు అనేది కుటుంబంలోని బంధాలు, బాంధవ్యాలు గురించి చెప్పిన ఎంటర్టైనర్. ఈ సినిమాపై థియేటర్లలో ప్రేక్షకులు చూపిన ప్రేమ మాకెంతో ఆనందాన్నిచ్చింది. ఇప్పుడు ZEE5 ద్వారా ఈ సినిమా ఇంకా ఎక్కువ భాషల్లో, ఎక్కువ దేశాల్లో ఉన్న ప్రేక్షకుల దగ్గరకు చేరువ కానుండంటం మరింత సంతోషంగా ఉంది. ఒక కథ సినిమాహాళ్లను దాటి, నేరుగా ప్రజల ఇళ్లలోకి చేరడం అనేది ఎప్పుడూ చాలా ప్రత్యేకమే అన్నారు. అలాగే వెంకటేశ్ దగ్గుబాటి మాట్లాడుతూ.. మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే, చక్కటి వినోదాన్ని.. హృదయాన్ని తాకే బంధాలతో, ఎమోషన్స్తో చక్కగా కలగలిపి సినిమా చేశారు. చిరంజీవి గారితో తొలిసారి కలిసి పని చేయడంతో ఈ జర్నీ నాకింకా ప్రత్యేకంగా మారింది. ఇప్పుడు ఈ సినిమా ZEE5 ద్వారా అనేక భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల వరకు చేరుతుండటం చాలా సంతోషంగా ఉంది. కుటుంబం అంతా కలిసి ఈ సినిమాలోని భావోద్వేగం, హాస్యం, డ్రామాను ఆస్వాదిస్తారనే నమ్మకం ఉంది అని అన్నారు.

