తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో మోస్తరు వర్షాలు, ఈదురు గాలులు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.. ఏపీలో ఒకవైపు 41-42°C ఉష్ణోగ్రతలతో ఉక్కపోత, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి.
తెలంగాణలో పశ్చిమ, వాయువ్య గాలుల ప్రభావంతో వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. జూన్ 9, సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇక రానున్న 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం ఖమ్మం, రామగుండంలో గరిష్టంగా 40.4°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా, మహబూబ్నగర్లో కనిష్టంగా 35°C నమోదయ్యే చాన్స్ ఉందని అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు
ఏపీలో వాతావరణం మరింత విభిన్నంగా ఉంది. ఒకవైపు ఎండల తీవ్రత 41-42°C వరకు ఉండగా, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో ఉక్కపోత తీవ్రత అధికంగా ఉండగా… కర్నూలు, ప్రకాశం, బాపట్ల, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.
జూన్ 8, ఆదివారం అనకాపల్లిలో 5 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదు కాగా, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 41°C వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నైరుతి పశ్చిమన గాలుల ప్రభావంతో గంటకు 40-50 కిమీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ భిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎండల తీవ్రతతో పాటు ఈదురు గాలులు, వర్షాలు రైతులకు, కూలీలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండి వాతావరణ హెచ్చరికలను గమనించవలసిన అవసరం ఉంది. సూచనల ప్రకారం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు.