డియర్ మినిస్టర్స్.. నోట్ దిస్ పాయింట్స్.. మీరు మంత్రులైనంత మాత్రాన అన్నీ మాట్లాడేస్తాం.. పక్క వాళ్ల శాఖలో కలగజేసుకుంటామంటే కుదరదు అంటోంది పీసీసీ. కోర్టులో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మంత్రులు కామెంట్స్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు పీసీసీ చీఫ్. రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న అంశంపై ఎలా ప్రకటన చేస్తారని ఫైర్ అయ్యారాయన.
కేబినెట్లో చర్చ జరగకుండానే స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు ప్రకటనలు చేయడంపై పీసీసీ సీరియస్ అయింది. కోర్టులో ఉన్న అంశాలపై ఎలా పడితే అలా మాట్లాడతారా? ఒకరి శాఖలో మరొకరు చొరబడితే ఎలా? ఏదైనా మాట్లాడే ముందు పార్టీని సంప్రదించాల్సిన అవసరం లేదా అంటూ మంత్రులపై మండిపడింది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్. రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న అంశంపై తొందరపాటు ప్రకటనలు సరికాదన్నారు.
క్యాబినెట్లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అని ఫైర్ అయ్యారు. పార్టీలో చర్చించకుండా అలాంటి ప్రకటనలు చేయొద్దన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలపైనే మాట్లాడాలని హితవు పలికారు మహేష్ కుమార్ గౌడ్.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ సిద్ధంగా ఉండాలని మాత్రమే తాను చెప్పానని.. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందన్న విషయాన్ని తాను బహిర్గతం చేయలేదన్నారు మంత్రి సీతక్క. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు ప్రకటనలు చేయడం వల్ల పీసీసీకి కొత్త తలనొప్పులు వచ్చాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న కాంగ్రెస్ పార్టీ బలహీనవర్గాలను మోసం చేసిందంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. దీంతో పీసీసీ మంత్రులపై మండిపడిందంటున్నారు కాంగ్రెస్ నేతలు.