రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ 2025 ఆన్లైన్ రాత పరీక్షలు శుక్రవారం (జూన్ 6) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. జూన్ 6 నుంచి 30వ తేదీ వరకు మొత్తం 44 దశల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఇక ఈ పరీక్షలకు కేటాయించిన మొత్తం 137 పరీక్ష కేంద్రాల్లో కొన్ని హైదరాబాద్లోనూ ఉన్నాయి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ 2025 ఆన్లైన్ రాత పరీక్షలు శుక్రవారం (జూన్ 6) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. జూన్ 6 నుంచి 30వ తేదీ వరకు మొత్తం 44 దశల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు మరో సెషన్ పరీక్షలు జరుగుతాయి. ఇక ఈ పరీక్షలకు కేటాయించిన మొత్తం 137 పరీక్ష కేంద్రాల్లో కొన్ని హైదరాబాద్లోనూ ఉన్నాయి. ఇందులో ఏపీతోపాటు హైదరాబాద్, కోదాడ, చెన్నై, బెంగళూరు, బెర్హంపూర్లో మరో 17 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మొత్తం 16,437 పోస్టులకు 3,36,305 మంది 5,77,675 దరఖాస్తులు చేసుకున్నారు. నాన్ లోకల్ కింద 20 శాతం ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీపడేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 7 వేల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేశారు. అయితే తాజాగా తెలంగాణ టెట్ జూన్ సెషన్ 2025 పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ ప్రకటించింది. ఇందులో కొన్ని తేదీల్లో ఒకేరోజు తెలంగాణ టెట్, ఏపీ డీఎస్సీ పరీక్ష వస్తున్నాయి. దీంతో అభ్యర్థులు ఏదో ఒక పరీక్షను వదులుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.
కొందరికి హైదరాబాద్లో పరీక్ష కేంద్రాలు కేటాయించగా, మరికొందరు ఏపీ వెళ్లి రాయాల్సి ఉంటుంది. 8 రోజులపాటు రెండు రాష్ట్రాల్లో ఈ పరీక్షలు ఉన్నాయి. జూన్ 20వ తేదీన ఎక్కువ మందికి ఇటు టెట్ పేపర్ 1, అటు ఏపీ డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులు జరుగుతున్నాయి. దీంతో ఏ పరీక్ష రాయాలో.. దేనిని వదులు కోవాలో తెలియక అభ్యర్ధులు గందరగోళ పడుతున్నారు.