విజయవాడ, విశాఖ ప్రజలకు అద్దిరిపోయే శుభవార్త.. ఇది కదా కావాల్సింది

విజయవాడ, విశాఖ ప్రజలకు అద్దిరిపోయే శుభవార్త.. ఇది కదా కావాల్సింది

విజయవాడ, విశాఖ వాసులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్ అందించనుంది ఏపీ ప్రభుత్వం. ఇది అందుబాటులోకి వస్తే రెండు నగరాలలో ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే. మరి ఆ స్టోరీ ఏంటో తెలియాలంటే ఇది మీరు చూడాల్సిందే. లేట్ ఎందుకు ఓ సారి లుక్కేయండి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారీ బాధ్యతలను సికింద్రాబాద్‌కు చెందిన బార్సిల్ సంస్థకు అప్పగించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ ప్రక్రియలో ఇతర సంస్థల కంటే తక్కువ ధరను కోట్ చేసిన బార్సిల్ సంస్థను రాష్ట్ర మెట్రోరైల్ కార్పొరేషన్ సిఫార్సు చేసింది.

డబుల్ డెక్కర్ మెట్రో ప్రాజెక్టు వివరాలు..
ఈ ప్రాజెక్టులో విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో డబుల్ డెక్కర్ మెట్రో రైలు మార్గాలు ప్రతిపాదించబడ్డాయి. విశాఖపట్నంలో మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వరకు మొత్తం 19 కి.మీ మేరకు డబుల్ డెక్కర్ మెట్రో మార్గాలు నిర్మించనున్నారు. విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు 4.70 కి.మీ మేరకు డబుల్ డెక్కర్ మెట్రో మార్గం ప్రతిపాదించబడింది.

ప్రాజెక్టు ఆమోదం, నిధుల సమీకరణ..
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ మెట్రో ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఆమోదించింది. విశాఖపట్నంలో తొలి దశలో 46.23 కి.మీ. పొడవున మూడు కారిడార్లు నిర్మించనున్నారు. దీనికి రూ.11,498 కోట్ల వ్యయం అంచనా వేశారు. రెండో దశలో 30.67 కి.మీ. పొడవున మరో కారిడార్ నిర్మించనున్నారు. దీని వ్యయం రూ.5,734 కోట్లు. విజయవాడలో మెట్రో ప్రాజెక్టు కోసం గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు, అలాగే అమరావతి వరకు కారిడార్లు ప్రతిపాదించారు. మూడో కారిడార్‌ను దాదాపు 27.75 కి.మీ మేర నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

కేంద్రం నుంచి నిధుల మంజూరు..
కేంద్ర ప్రభుత్వం ఈ మెట్రో ప్రాజెక్టుల డీపీఆర్ తయారీకి అవసరమైన నిధులను ఇప్పటికే మంజూరు చేసింది. సమగ్ర మొబిలిటీ ప్లాన్(CMP) పథకంలో భాగంగా ఈ నిధులు విడుదలయ్యాయి. విశాఖపట్నంలో రూ.84.47 లక్షలు, విజయవాడలో రూ.81.68 లక్షలతో ప్లాన్‌ను రూపొందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, డిజైన్, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖపట్నంలో మెట్రో నిర్మాణం కోసం యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ(UMTA)ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ కేంద్రంతో సంప్రదింపులు, నిధుల సమీకరణ, భూ సేకరణ వంటి అంశాల్లో కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు