సముద్ర గర్భంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.. చూస్తే సెల్యూట్ చేయాల్సిందే..

సముద్ర గర్భంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.. చూస్తే సెల్యూట్ చేయాల్సిందే..

దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.. వాడ వాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. పంద్రాగస్టు వేడుకలతో భారతజాతి పులకించిపోయింది. ఇంతటి మహోన్నత రోజున.. విశాఖ సాగరంలో మరో అరుదైన దృశ్యం కనువిందు చేసింది. సాగర గర్భంలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు స్కూబా డ్రైవర్లు. లెహెరావో తిరంగా అంటూ దేశభక్తి చాటుకున్నారు.

విశాఖలో స్కూబా డ్రైవర్లు దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నారు. మువ్వన్నెల జెండాను సముద్ర గర్భంలో ఆవిష్కరించారు. 79 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా.. 50 అడుగుల లోతు సముద్ర గర్భంలో జాతీయ జెండా నీటిలో రెపరెపలాడింది. మాజీ నేవీ సబ్ మెరైనర్, స్కూబా ఇన్స్ట్రక్టర్ బలరాం నాయుడు నేతృత్వంలో 8 మంది సభ్యుల బృందం ఈ ఘనతను సాధించారు. దాదాపు అరగంట పాటు జాతీయ జెండాతో విహరించి సెల్యూట్ చేశారు. అదికూడా జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో ఇటీవల గుర్తించిన పగడపు దిబ్బల ప్రదేశంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి దేశభక్తిని చాటుకున్నారు.

ఋషికొండ తీరానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో.. వెళ్లి సముద్రంలో డైవ్ చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేళ దేశభక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ విడుదల నుంచి సముద్రాన్ని కాపాడాలంటూ పిలుపునిచ్చారు. దాదాపు అరగంట పాటు సముద్రంలోనే జాతీయ జెండాతో ఉన్నారు.

ఈ మొత్తం కార్యక్రమానికి దాదాపు రెండు గంటల సమయం పట్టిందని.. సముద్రంలో అరగంట పాటు జాతీయ జెండా ప్రదర్శించామని బలరామ్ నాయుడు టీవీ9 కి వివరించారు. జాతీయ జెండాను తీసుకెళ్లడం సముద్రంలో 50 అడుగుల లోతులో ఆవిష్కరించడం తో పాటు.. అక్కడ వరకు స్కూ బా డైవింగ్ కిట్లతో వెళ్లి.. ఈ అద్భుత ఘట్టాన్ని కెమెరాలో షూట్ చేయడం మరో విశేషం..

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు