గణేష్ నిమజ్జనానికి భాగ్యనగరం సిద్దం.. ఈ రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్స్‌..!

గణేష్ నిమజ్జనానికి భాగ్యనగరం సిద్దం.. ఈ రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్స్‌..!

గణేశ్‌ ఉత్సవాల మహా శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. ప్రధాన మార్గం, అనుబంధ మార్గాలు, తిరుగు ప్రయాణం, భక్తులు వెళ్లే మార్గాలు, నిమజ్జన ప్రాంతాలు, బేబీ పాండ్లు ఇతర వివరాల రూట్‌మ్యాప్‌ను విడుదల చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌. మరోవైపు ఈ ఏడాది గణనాథుడి ఊరేగింపు శోభాయాత్రలో నో సౌండ్స్ అంటూ పోలీసులు ఆంక్షలు విధించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

గణేశ్‌ ఉత్సవాల మహా శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. ప్రధాన మార్గం, అనుబంధ మార్గాలు, తిరుగు ప్రయాణం, భక్తులు వెళ్లే మార్గాలు, నిమజ్జన ప్రాంతాలు, బేబీ పాండ్లు ఇతర వివరాల రూట్‌మ్యాప్‌ను విడుదల చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌. మరోవైపు ఈ ఏడాది గణనాథుడి ఊరేగింపు శోభాయాత్రలో నో సౌండ్స్ అంటూ పోలీసులు ఆంక్షలు విధించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాలు అంటే ప్రతి ఒక్కరి చూపు భాగ్యనగరం వైపు ఉంటుంది. చాలామంది భక్తులు నిమజ్జనాలను తిలకించడానికి ఎక్కువగా ప్రజలు ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ కి వస్తుంటారు. దీంతో పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు, సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరం నలుమూలల నుంచి వినాయకులను తీసుకొచ్చే ప్రధాన శోభయాత్ర మార్గంను సీపీ సివి ఆనంద్ విడుదల చేశారు. వినాయకుల ప్రధాన రూట్ కట్ట మైసమ్మ ఆలయం నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు మొత్తం 13 కి.మీ.లు మేర ఉండనుంది.

ప్రధానంగా బాలాపూర్‌ గణపతి కేశవగిరి, చాంద్రాయణగుట్ట పైవంతెన తర్వాత ఎడమవైపు తీసుకుని, మహబూబ్‌నగర్‌ క్రాస్‌రోడ్డు మీదుగా ఫలక్‌నూమా రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, అలియాబాద్‌, నాగులచింత-చార్మినార్‌, మదీనా, అఫ్జల్‌గంజ్‌, ఎస్‌ఏబజార్‌, ఎంజే మార్కెట్‌, అబిడ్స్‌, బషీర్‌బాగ్‌, లిబర్టీ జంక్షన్‌, అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ఎన్టీఆర్‌ మార్గ్, పీవీఎన్‌ఆర్‌ మార్గం వైపు శోభాయాత్ర సాగనుంది. ఈ మార్గాల్లో గణపతి విగ్రహాలు లేని ఏ వాహనాన్నీ అనుమతించమని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు.

సెప్టెంబర 6వ తేదీన ఉదయం 6 నుంచి 7వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ సీపీ తెలిపారు. హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం వరకూ కొనసాగుతాయి. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో భారీ వాహనాలు, ట్రాలీలు హైదరాబాద్ నగరంలోకి అనుమతించరు. ట్రాఫిక్‌ మళ్లింపు ఆర్టీసీ బస్సులకూ కూడా వర్తిస్తుందని పోలీసులు చెబుతున్నారు. ప్రైవేటు బస్సులను 6వ తేదీ ఉదయం 8 నుంచి 7వ తేదీ 10 గంటల వరకు నగరంలోకి అనుమతించరు.

గణేష్ నిమజ్జన వేడుకను చూస్తేందుకు ట్యాంక్ బండ్‌కు పెద్ద సంఖ్యలో జనాలు తరలివస్తారు. కాబట్టి వారి కోసం ట్యాంక్ బండ్ కి అన్ని వైపులా పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ స్టేడియం, కట్టమైసమ్మ గుడి, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ రోడ్డు, పబ్లిక్‌ గార్డెన్స్, బుద్ధభవన్‌ వెనుక భాగం, ఆదర్శ్‌ నగర్‌ రోడ్డు, బీఆర్‌కే భవన్‌ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం రోడ్డు, ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ జంక్షన్, ఖైరతాబాద్‌ ఎంఎంటీస్‌ స్టేషన్‌ దగ్గర పార్కింగ్ ప్రాంతాలు కేటాయించారు.

GHMC బేబీ పాండ్స్ జైపాల్‌రెడ్డి స్ఫూర్తి స్థల్, సంజీవయ్య పార్కు దగ్గర, నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్, సైదాబాద్‌ హౌసింగ్‌ కాలనీ, మూసారాం ఫ్రెండ్స్‌ కాలనీ, గౌలిపుర బతుకమ్మ బావి, ఐఎస్‌ సదన్‌ వైశాలినగర్, రియాసత్‌నగర్‌ శివాలయం, జంగంమెట్‌ రాజన్న బావి వద్ద ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్‌ స్టేడియం, చింతలబస్తీ రామ్‌లీలా మైదానం, మారేడ్‌పల్లి ప్లే గ్రౌండ్స్, చిలకలగూడ జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, అమీర్‌పేట ప్లే గ్రౌండ్, అంబర్‌పేట అలీ కేఫ్, కుల్సుంపర ఎస్‌బీఏ గార్డెన్, నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ పోర్టబుల్‌ వాటర్‌ ట్యాంకులు ఉన్నాయి.

ఇక ట్యాంక్ బండ్ వద్దకు రావడానికి 600 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. బషీర్‌బాగ్, ఇందిరాపార్క్, లక్డీకాపూల్, లిబర్టీ, ఆల్‌ ఇండియా రేడియో, ఖైరతాబాద్‌ వద్దకు బస్సులు చేరుకుంటాయి. సమాచారం కోసం 9959226160, 9959226154, అలాగే ఎటువంటి సందేహాలు ఉన్నా హెల్ప్‌లైన్ నంబర్లు 040-27852482, 8712660600, 9010203626 అందుబాటులో ఉన్నాయి. భక్తులు, ప్రయాణికులు ఈ సూచనలను గౌరవించి శాంతియుతంగా నిమజ్జనం జరపాలని హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

నిమజ్జనం రోజున 30 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. పోలీసు విభాగాల సిబ్బంది. పారా మిలిటరీ, రిజర్వ్‌ ఫోర్స్‌తో పాటు జిల్లాల నుంచి పోలీసు సిబ్బంది, అధికారులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిమజ్జనాల మధ్యలో ప్రవక్త పుట్టిన రోజు (మిలాద్‌ఉల్‌నబీ) రావడంతో భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. నిమజ్జనాన్ని ఉన్నతాధికారులు కమాండ్‌ కంట్రోల్‌ రూము ద్వారా పర్యవేక్షిస్తున్నారు. సెప్టెంబరు 6 ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ మహానగరం తోపాటు సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం, కల్లు, విక్రయాలు నిలిపి వేయాలని పోలీస్ కమిషనర్లు ఆదేశించారు.

మహా నిమజ్జనం సందర్భంగా.. హుస్సేన్‌సాగర్‌తో పాటు ఇతర చోట్ల వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాగర తీరంలోని ఎన్‌టీఆర్‌ మార్గ్‌, పీపుల్స్‌ ప్లాజా, సంజీవయ్య పార్కు వైపు ఇప్పటికే క్రేన్లు అందుబాటులో ఉన్నాయి. గురువారం రోజున ట్యాంక్‌బండ్‌పై పది క్రేన్లు ఏర్పాటు చేశారు. నిమజ్జన ఏర్పాట్లపై భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి, భజరంగ్‌దళ్‌, వీహెచ్‌పీ తదితర సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేసిన మర్నాడే ప్రభుత్వ విభాగాలు రంగంలోకి దిగాయి. క్రేన్లు, కంట్రోల్‌ రూమ్‌లు, మెడికల్‌ క్యాంపులు, మొబైల్‌ టాయిలెట్లు, తదితర సదుపాయాలు ఏర్పాటు చేశాయి. అటు సరూర్‌నగర్‌, ఐడీఎల్‌, సఫిల్‌గూడ, సున్నం చెరువుతోపాటు 20 ప్రాంతాల్లో భారీ విగ్రహాల నిమజ్జనం జరగనుంది. మొత్తంగా 134 మొబైల్‌, 259 స్టాటిక్‌తో కలిపి 403 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఇందులో సాగర తీరం చుట్టూ 30 వరకు క్రేన్లు ఉన్నాయి.

మరోవైపు హైదరాబాద్ నిమజ్జనం వేళ డిజెలు, అధిక శబ్దాలు వచ్చే బ్యాండ్ పై నిషేధం విధించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ పండుగలు అంటేనే ఆటపాట నృత్యాలు ఉంటాయి… హిందూ పండుగలు పైనే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. కాగా, హైదరాబాద్ మహా నిమజ్జన సందర్భంగా భక్తులు, ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని కోరుతున్నారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు