సికింద్రాబాద్ బోయిన్పల్లిలో దొంగతనం, మోసం కలిపిన పెద్ద ఘటన వెలుగులోకి వచ్చింది. బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి మొబైల్ను గుర్తు తెలియని దుండగుడు దొంగిలించి, ఆ ఫోన్ ద్వారా రెండు బ్యాంక్ ఖాతాల నుంచి రూ.6 లక్షలకు పైగా డబ్బు కాజేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు
సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ, మోసానికి సంబంధించిన కేసు వెలుగుచూసింది. గుర్తు తెలియని దుండగుడు ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ను దొంగిలించడమే కాకుండా.. ఆ ఫోన్లోని డేటాను వాడుకుని రెండు బ్యాంక్ ఖాతాల నుంచి రూ.6 లక్షలకు పైగా నగదును ఖాళీ చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్కు చెందిన ప్రసాద్రావు బోయిన్పల్లిలోని బస్ స్టాప్ వద్ద నాందేడ్కు వెళ్లే బస్సు ఎక్కుతుండగా ఈ సంఘటన జరిగింది. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆయన మొబైల్ ఫోన్ను చప్పుడు కాకుండా దొంగిలించాడు.
తరువాత ప్రసాద్రావు బోధన్లో కొత్త మొబైల్ ఫోన్ కొనుగోలు చేసి.. తన పాత నంబర్కు కొత్త సిమ్ తీసుకున్నారు. సిమ్ను ఫోన్లో ఇన్సర్ట్ చేసిన వెంటనే వరుసగా మెసేజ్లు వచ్చాయి వాటిలో ఆయన రెండు బ్యాంక్ ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు విత్డ్రా అయినట్లు వివరాలు ఉండటంతో షాక్కు గురయ్యాడు. వెంటనే బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ప్రసాద్రావు వివరాలు పరిశీలించిన పోలీసులు.. రెండు ఖాతాల నుంచి కలిపి రూ.6 లక్షలకు పైగా డబ్బు మాయం అయినట్లు గుర్తించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. మొత్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేట్టారు. సీసీటీవీ ఫుటేజ్, బ్యాంక్ లావాదేవీలు, ఫోన్ ట్రాకింగ్ ఆధారాలు పరిశీలిస్తున్నామని చెప్పారు.