2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ‘దోస్త్’ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తయిన సంగతి తెలిసిందే. తొలి విడతలో మొత్తం 89,572 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. వీరిలో 65,191 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఇక ఈ విడతలో 60,436 మంది విద్యార్ధులకు సీట్లు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ‘దోస్త్’ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తయిన సంగతి తెలిసిందే. తొలి విడతలో మొత్తం 89,572 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. వీరిలో 65,191 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఇక ఈ విడతలో 60,436 మంది విద్యార్ధులకు సీట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు దోస్త్ తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తవడంతో ఈ రోజు నుంచి రెండో విడత కౌన్సెలింగ్కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు మొదలవనున్నాయి.
ఇక రాష్ట్రంలోని అధిక మంది విద్యార్ధులు గతేడాది మాదిరిగానే ఈసారి కూడా కామర్స్ వైపే మొగ్గు చూపారు. అందుకు కారణం తొలి విడతలో కామర్స్ కోర్సులో అత్యధికంగా 21,758 మంది సీట్లు సాధించమే. ఆ తర్వాత లైఫ్ సైన్సెస్లో 11,005 మంది విద్యార్థులు సీట్లు పొందినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఫిజికల్ సైన్సెస్లో 15,249 మంది, ఆర్ట్స్లో 5,986 మంది చొప్పున విద్యార్థులు సీట్లు పొందారు. కాగా ఈ ఏడాది మొత్తంగా 805 కాలేజీల్లో 457 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 3,71,096 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దోస్త్లో వీటిని భర్తీ చేస్తారు. అయితే వీటిలో తొలి విడతలో ఒక్క సీటు కూడా నిండని కాలేజీలు 74 ఉండటం విశేషం.
రెండో ఫేజ్ రిజిస్ట్రేషన్లు మే 30 నుంచి జూన్ 8 వరకు కొనసాగుతాయి. మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవల్సి ఉంటుంది. ఇక జూన్ 13న సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. మూడో ఫేజ్ దరఖాస్తుల స్వీకరణ జూన్ 13 నుంచి 19 వరకు ఉంటుంది. జూన్ 13 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లు, జూన్ 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. దీంతో మూడు ఫేజ్లలో డిగ్రీ ప్రవేశాలు పూర్తవుతాయి. జూన్ 30 నుంచి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభం అవుతాయి.