మే నెలలో శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రికార్డు స్థాయిలో 27 లక్షలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఢిల్లీ విమానాశ్రయంతో పోలిస్తే 15.3% అధిక వృద్ధిని సాధించింది. దేశీయ, అంతర్జాతీయ విమానాల సంఖ్య పెరుగుదలతో ప్రయాణికుల రద్దీ పెరిగింది.
అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఒకటి. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ విమానాశ్రయం నుంచి లక్షలాదిమంది ఇతర రాష్ట్రాలకు, దేశాలకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ ఎయిర్పోర్ట్లో ప్రత్యేక నిఘా వ్యవస్థతో పాటు సెంట్రల్, స్టేట్ పోలీసులతో భారీ భద్రత ఉంటుంది. భద్రత విషయంలో హై సెక్యూరిటీ జోన్ ఉన్నటువంటి ఎయిర్ పోర్ట్గా గుర్తింపు కూడా ఉంది. అదే విధంగా ఈ ఎయిర్ పోర్ట్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ జీఎంఆర్ సంస్థ మరొక రికార్డును తమ ఖాతాలో వేసుకుంది.
ఎయిర్ పోర్ట్ ప్రారంభం అయిన తర్వాత గత నెల అత్యధిక మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఢిల్లీతో పోలిస్తే ప్రయాణికుల విషయంలో మన శంషాబాద్ విమానాశ్రయం ముందంజలో ఉంది. జీఎంఆర్ సంస్థ మొత్తం ఐదు విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. తమ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఐదు విమానాశ్రయాలకు సంబంధించి మే నెలలో ప్రయాణికుల రాకపోకలపై వృద్ధిపై ఒక నివేదిక విడుదల చేసింది. ఈ ఐదు విమానాశ్రయాల్లో కలిపి మొత్తం కోటి మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారని పేర్కొంది. అయితే ఒక్క శంషాబాద్ విమానాశ్రయం నుంచి రికార్డ్ స్థాయిలో 27 లక్షల 91 వేల 217 మంది దేశీయ అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించారు.
మే నెలలో జీఎంఆర్ విమానాశ్రయాలలో సగటు ప్రయాణికుల వృద్ధి 0.8 శాతంగా నమోదైంది. కానీ, శంషాబాద్ విమానాశ్రయం అత్యధికంగా 15.3 శాతం వృద్ధిని సాధించింది. అదే సమయంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం 4.5 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రతిరోజు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య దాదాపు లక్షకు చేరువవుతోంది. ఇప్పటివరకు ప్రతి రోజు 95 వేల నుంచి 97 వేల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి దేశంలో 74 ప్రాంతాలకు విదేశాల్లోని 21 ప్రాంతాలకు ప్రతి రోజు 620 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి.