అందాలనగరం హైదరాబాద్ మరింత అందంగా కనిపిస్తోందిప్పుడు. ప్రపంచ అందగత్తెలందరూ అడుగుపెట్టడంతో… సిటీలో ఆజోష్ వేరే లెవల్లో ఉందిప్పుడు. చార్మినార్ లాడ్ బజార్లో గాజుల నుంచి.. ఓరుగల్లులోని రామప్ప గుడి శిల్పకళ దాకా… ఈ సుందరీమణుల రాక కోసం అంతటా శోభాయమానమైన వాతావరణం కనిపిస్తోంది.
హైదరాబాద్వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనేందుకు విచ్చేసిన విభిన్నదేశాల సుందరాంగులు… ఇప్పుడు తెలంగాణలో సందడి చేస్తున్నారు. అట్టహాసంగా ప్రారంభమైన ఈ పోటీలు.. మరికొన్ని రోజుల పాటు జరగనుండగా… రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను చుట్టి వచ్చేస్తున్నారు ఈ వరల్డ్ బ్యూటీస్.
స్పిరిచువల్ టూరిజంలో భాగంగా నాగార్జున సాగర్లోని బుద్ధ వనంను సందర్శించారు 30 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. వారికి అక్కడ భారీస్థాయిలో స్వాగత ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. అందగత్తెలు, బుద్ధ వనంలో పది నిమిషాల పాటు ధ్యానం చేశారు. ఇక, మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కు చెందిన మరొక బృందం.. యాదాద్రి ఆలయం సందర్శించి, అటునుంచి అటే పోచంపల్లి వెళ్లి చేనేత చీరలు నేయడాన్ని పరిశీలించారు.
చార్మినార్ అనగానే ప్రసిద్ధ కట్టడమే కాదు… అక్కడి మార్కెట్లో దొరికే గాజులు, ముత్యాలు కూడా గుర్తుకొస్తాయ్. మగువల మనసుదోచే బ్యాంగిల్స్కి పెట్టిందిపేరు ఇక్కడి లాడ్ బజార్. దేశంలోనే కాదు, ప్రపంచ ప్రఖ్యాతిపొందిన మార్కెట్ ఇది. అలాంటి మార్కెట్లు ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తున్నాయి.
దీనంతటికీ కారణం ఇక్కడికి మిస్ వరల్డ్ సుందరీమణులు రానుండటమే. మంగళవారం సాయంత్రం.. లాడ్ బజార్ దగ్గర జరిగే హెరిటేజ్ వాక్లో పాల్గొనున్న వరల్డ్ బ్యూటీస్… ఆ తర్వాత చౌమహల్లా ప్యాలెస్ లో ప్రభుత్వం ఇచ్చే వెల్కమ్ డిన్నర్ను ఆస్వాదించనున్నారు. దీంతో.. చార్మినార్ దగ్గర భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు పోలీసులు.
మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా తెలంగాణకు తరలివచ్చిన ప్రపంచస్థాయి కంటెస్టెంట్స్ ఈ నెల 14న… వరల్డ్ హెరిటేజ్ కట్టడం రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు. సుందరీమణుల రాక కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో రక్షణ చర్యలు చేపట్టింది. రామప్ప దేవాలయాన్ని సర్వాంగ సుందర్భంగా ముస్తాబు చేయించిన అధికారులు.. అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.