టీ-20 ఫార్మాట్లో తగ్గేదేలేదన్నట్లు టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరల్డ్ కప్ వదులుకున్న చోటే.. టీ-20 కప్ను ముద్దాడింది. ఒక్క గెలుపుతో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. మరెన్నో రికార్డులు సాధించింది యువ భారత్.. హోం గ్రౌండ్లో భారత్ గర్జిస్తే ఎలా ఉంటుందో.. అహ్మదాబాద్ స్టేడియంలో ప్రపంచానికి తెలిసేలా చేసింది టీమిండియా..
ఆట.. కాదు.. అదో వేట. వార్ వన్ సైడ్ అయితే ఎలా ఉంటుందో.. హోం గ్రౌండ్లో భారత్ గర్జిస్తే ఎలా ఉంటుందో.. అహ్మదాబాద్ స్టేడియంలో ప్రపంచానికి తెలిసేలా చేసింది టీమిండియా.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో మాటల్లేవ్.. మాట్లాడుకోటాల్లేవ్ అన్నట్లు సాగింది భారత ప్రదర్శన. ముచ్చటగా మూడోసారి టీ-20 వరల్డ్ కప్ను సొంతం చేసుకుంది. వాస్తవానికి టీ-20 ఆరంభంలోనే USAతో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లో చెమటోడ్చారు. సూపర్-8లోనూ శ్రమించారు. సౌతాఫ్రికాపై ఓడారు. సెమీస్లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరకు 7 పరుగుల తేడాతో గెలిచారు. సెమీస్ పొరపాట్లు రిపీట్ అవ్వకుండా..ఫైనల్లో జాగ్రత్త పడ్డారు. సూపర్-8 వరకు ఒక లెక్క.. క్వార్టర్స్, సెమీస్, ఫైనల్లో భారత ప్రదర్శన మరోలెక్క. ప్రత్యర్థికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా.. కప్ చేజిక్కించుకోవడమే కాకుండా ఎన్నో రికార్డులు సాధించింది టీమిండియా.
వరుసగా రెండోసారి, ఓవరాల్గా మూడోసారి టీ-20 ట్రోఫీని అందుకుంది టీమిండియా. 2007, 2024, 2026లో టీ-20 వరల్డ్ కప్ను భారత్ కైవసం చేసుకుంది. 20 ఏళ్ల టీ-20 వరల్డ్ కప్ చరిత్రలో.. మరే జట్టు మూడు ట్రోఫీలను అందుకోలేదు. అలాగే.. అతిథ్యం ఇస్తూ కప్ గెలిచిన టీమ్గా కూడా భారత్ రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు ఆతిథ్య జట్టు.. ఎప్పుడూ కప్ గెలవలేదు. టీ-20 వరల్డ్ కప్ ఫైనల్లో హైయ్యస్ట్ స్కోరర్గా తన రికార్డ్ తానే బ్రేక్ చేసింది టీమిండియా. 2024లో 176పరుగులతో అత్యధిక స్కోర్ చేసి మ్యాచ్ విన్ అవ్వగా.. ఈసారి 255 పరుగుల అత్యధిక స్కోర్ చేసింది. అత్యధిక పవర్ ప్లే స్కోర్, అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన టీమ్గానూ భారత్ రికార్డ్ సృష్టించింది.
భారత టీ-20 ఓపెనింగ్ జోడీ సంజూ శాంసన్- అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20 ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో యాభైకి పైగా స్కోరు సాధించిన ఓపెనింగ్ జంటగా ప్రపంచ రికార్డు క్రియేట్ చేశారు. వీరిద్దరి విధ్వంసం కారణంగా.. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. ఫైనల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన ప్లేయర్గా అభిషేక్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 18 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు.
మూడేళ్లుగా ICC ట్రోఫీలను శాసిస్తుంది భారత్. 2024లో టీ-20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా. 2025లో ఉమెన్స్ వరల్డ్ కప్, మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది. 2026లో టీ-20 వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా.
2023 నవంబర్ 19న భారత జట్టు ఇదే అహ్మదాబాద్ మైదానంలో ఆస్ట్రేలియాతో చేతిలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓడి తీవ్ర నిరాశకు గురైంది. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ‘మెన్స్ డే’గా జరుపుకుంటారు. కానీ ఇప్పుడు ‘ఉమెన్స్ డే’ రోజు టీమిండియా అదే మైదానంలో మరో వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్లో సత్తా చాటి విశ్వవిజేతగా నిలిచింది. టీ-20ల్లో తమను బీట్ చేసే వారే లేరని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది.

