ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అస్థిరత నెలకొనడంతో బంగారం విలువ పెరుగుతూ పోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో చాలా దేశాలు తమ బంగారు నిల్వలను పెంచుకునే పనిలో పడ్డాయి. భారత్ కూడా విదేశాల్లో ఉన్న బంగారు నిల్వల్ని ఇండియాకు తరలిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..
ఒకపక్క అంతర్జాతీయంగా వాణిజ్యంలో అవకతవకలు మరోపక్క యుద్ధాల నేపథ్యంలో బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడిగా మారింది. దీంతో పలు దేశాలతో పాటు కేంద్ర బ్యాంకులు కూడా తమ పోర్ట్ఫోలియోలో బంగారం వాటాను పెంచుకుంటున్నాయి. ప్రస్తుతం భారత్ దగ్గర సెప్టెంబర్ నెలాఖరు నాటికి మొత్తం 880.8 టన్నుల బంగారం నిల్వలు ఉండగా వీటిలో చాలా వరకు విదేశాల్లోనే ఉన్నాయి. భారత్ వీటిని ఇప్పుడు స్వదేశానికి రప్పిస్తుంది.
భారిగా బంగారం తరలింపు
భారత్ దగ్గర మొత్తం 880 టన్నులకుపైగా బంగారు నిల్వలు ఉండగా వీటిలో 575.8 టన్నుల బంగారం మాత్రమే ఇండియాలో ఉంది. మిగతాది విదేశాల్లో ఉంది. విదేశీ వర్తకం చేయడం కోసం బంగారాన్ని పెట్టి డాలర్స్ ను ట్రేడ్ చేస్తుంటాయి దేశాలు. అయితే ఇప్పుడు భారత్ ప్లాన్ మార్చింది. విదేశాల్లో ఉన్న బంగారాన్ని మెల్లగా ఇండియాకు తరలిస్తుంది భారత ప్రభుత్వం. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే ఏకంగా 64 టన్నుల బంగారాన్ని.. భారత్ తన సొంత ఖజానాకు చేర్చింది. గత నాలుగేళ్లలో దేశంలోని బంగారు నిల్వలు దాదాపు రెట్టింపు అయ్యాయి.
కారణం ఇదే..
విదేశాల్లో ఉన్న బంగారాన్ని భారత్ వెనక్కి తీసుకొచ్చేందుకు ముఖ్యమైన కారణాలే ఉన్నాయంటున్నారు నిపుణులు. ఆర్థిక యుద్ధాలు జరుగుతున్న క్రమంలో కొన్నిదేశాలు విదేశీ ఆస్తుల్నిబ్లాక్ చేసే అవకాశం కూడా ఉంది. గతంలో రష్యా, అఫ్ఘానిస్థాన్ విదేశీ కరెన్సీ నిల్వల్ని జీ7 దేశాలు బ్లాక్ చేశాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మనదేశానికి ఎదురవ్వకుండా మన బంగారాన్ని మనం తెచ్చేసుకుంటున్నాం అన్న మాట. గత నాలుగేళ్లలోనే దాదాపు 280 టన్నుల బంగారాన్ని భారత్ వెనక్కి రప్పించింది. ఫ్యూచర్ లో మరింత బంగారాన్ని వెనక్కి తెచ్చే అవకాశం ఉంది. అలాగే దేశంలో ఉన్న బంగారు నిల్వలను పెంచే దిశగా కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇనాక్టివ్గా ఉన్న గోల్డ్ మైన్స్ ను యాక్టివేట్ చేసే ప్లాన్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది.

 
                                
