సిక్కోలులో సినుకు శివతాండవం చేసింది. నాగావళి, వంశధార వరదలతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతమైంది. మరోవైపు గుంటూరులో భారీ వర్షం దంచికొట్టింది. తెలంగాణలో కొన్ని ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.
ఎగువన ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో వరదలు పోటెత్తుతున్నాయి. వంశధార,నాగావళి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. పలు మండలాల్లో పంటపొలాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. జిల్లాలో ఎనిమిదివేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు అధికారులు. నాగావళి నదీతీరంలో బలహీనమైన కరకట్టలకు ఇసుక బస్తాలు వేసి బలోపేతం చేస్తున్నారు. నిన్నటి వరదల్లో జిల్లాలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నది తీర గ్రామాల్లో, పొలాలు చెరువులుగా మారిపోయాయి. రైతులు తమ పొలాలను చూసేందుకు వెళ్లాలంటే, ఈదుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. వర్షాలు తగ్గి మూడు రోజులు అవుతున్నా, వరి చేలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. మోటార్లు నీట మునిగాయని రైతులు వాపోతున్నారు. మోటార్లను వెలికి తీసి మరమ్మతులు చేయించాల్సి ఉందంటున్నారు. కోతకు వచ్చిన పంట నీట మునిగి తీవ్ర నష్టం వచ్చిందని ఆవేదన చెందుతున్నారు.
ఇక గుంటూరు నగరంలో భారీ వర్షం దంచికొట్టింది. వర్షపునీరు రోడ్ల పైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, గుంటూరు, పల్నాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు.. ఆయా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి పట్టణంలో రహదారులు నదులను తలపిస్తున్నాయి. రాజంపేట, దోమకొండ, భిక్కనూర్, బీబీపేట, మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అటు వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలో పలు ప్రాంతాలు భారీ వర్షంతో అతలాకుతమయ్యాయి. చిన్న నందిగామలో ఎస్సీ కాలనీ జలమయమైంది. వరద పోటెత్తడంతో నందిగామ-నీటూర్ మార్గంలో రోడ్డు తెగిపోయి, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తెలంగాణలో సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్-మల్కాజ్గిరి, యాదాద్రి-భువనగిరి, జనగామ జిల్లాలకు ఆరెంజ్అలర్ట్ ఇచ్చింది IMD. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. 40నుంచి 60కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.