అందుకు పవన్ కళ్యాణ్ ఫామ్‌హౌస్ కూడా అమ్మేయాలనుకున్నారు.. అసలు విషయాన్ని చెప్పేసిన హైపర్ ఆది

అందుకు పవన్ కళ్యాణ్ ఫామ్‌హౌస్ కూడా అమ్మేయాలనుకున్నారు.. అసలు విషయాన్ని చెప్పేసిన హైపర్ ఆది

జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం, ఆయనలోని సేవా గుణం గురించి ఆది పంచుకున్న ఆసక్తికర విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.

ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్ల తనకున్న అంతులేని అభిమానాన్ని, ఆయన రాజకీయ ప్రస్థానంపై గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నాడు. పవన్ కళ్యాణ్ పట్ల ప్రజలకున్నది కేవలం అభిమానం కాదని, అది పిచ్చి అని, ఆయన నిజాయితీ, అంకితభావానికి లభించిన గౌరవమని ఆది పేర్కొన్నాడు. సినిమాల్లోని భారీ ఎలివేషన్లతో పోలుస్తూ, కాకినాడలో పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అనగానే వచ్చిన స్పందన ఒక నిజాయితీగల నాయకుడికి లభించిన గౌరవమని ఉదహరించాడు. 2019లో ప్రజలు తెలియక ఓడించి ఉండవచ్చని, కానీ 2024లో తెలుసుకొని గెలిపించారని, ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నందున పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో ఇక ఎప్పటికీ ఓడిపోరని ధీమా వ్యక్తం చేశాడు.

పవన్ కళ్యాణ్ నిస్వార్థ రాజకీయాలను హైపర్ ఆది కొనియాడారు. తనకు కార్యాలయం, ఫర్నిచర్, జీతం అవసరం లేదని, సొంత ఖర్చులతోనే ప్రజాసేవ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశాడు. వర్షాల సమయంలో 400 పంచాయతీలకు ఒక్కో దానికి లక్ష రూపాయల చొప్పున నాలుగు కోట్ల రూపాయలను తన సొంత నిధుల నుంచే అందజేశారని తెలిపాడు. మామూలుగా ఏ రాజకీయ నాయకుడు కూడా గెలిచిన తర్వాత విశ్రాంతి తీసుకుంటారని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం విజయం తర్వాత కూడా జనాల్లోకి వెళ్లి అలుపన్నది లేకుండా కష్టపడుతున్నారని ప్రశంసించాడు. ఆయనకు పదవులను అనుభవించడం కంటే, ప్రజలకు సేవ చేయడమే ప్రధానమని స్పష్టం చేశాడు.

పవన్ కళ్యాణ్‌కు మద్దతు ఇవ్వడం వల్ల తన సినీ కెరీర్‌కు కొంత నెగటివిటీ ఏర్పడవచ్చనే మాట వాస్తవమే అయినా.. నిజాయితీగల వ్యక్తికి మద్దతు ఇస్తే సాధారణ ప్రజల్లో ఎప్పుడూ వ్యతిరేకత ఉండదని, సోషల్ మీడియాలో డబ్బుల కోసం పనిచేసే పది మందికి మాత్రమే తాము వ్యతిరేకం అవుతామని అన్నాడు. తాను ఏ ఊరు వెళ్ళినా, అవుట్‌డోర్ షూటింగ్‌లకు వెళ్ళినా ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఆదరిస్తారని, ప్రేమ చూపిస్తారని తన అనుభవాన్ని పంచుకున్నాడు. పవన్ కళ్యాణ్ డబ్బు పట్ల ఆసక్తి లేకపోవడాన్ని హైపర్ ఆది బలంగా నొక్కి చెప్పాడు. చాలా మందికి డబ్బు సంపాదించడం, ఆస్తులు కూడబెట్టడం లక్ష్యంగా ఉంటుందని, కానీ పవన్ కళ్యాణ్‌కు అది సమస్యే కాదని అన్నాడు. పార్టీని నడపడానికి తన ఫామ్‌హౌస్‌ను కూడా అమ్మెయ్యాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారని, నాగబాబు అడ్డుకోవడం వల్లే అది నిలిచిందని వివరించాడు. గెలిచిన తర్వాత కూడా అప్పుల్లో ఉన్న ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణేనని, వరదల సమయంలో ఇచ్చిన ఆరు కోట్ల రూపాయలు కూడా సినిమాలకు అడ్వాన్స్‌గా తీసుకొని ఇచ్చినవేనని తెలిపాడు. అవినీతికి పాల్పడాలని చూసే వారిని వెంటనే గెట్‌ఔట్ అంటారని, అలాంటి అలవాట్లు పవన్ కళ్యాణ్ వద్ద లేవని ఆది స్పష్టం చేశాడు.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు