తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగనుంది. రానున్న మూడ్రోజుల పాటు ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరుగుతాయని తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలను హైదరాబాద్ వాతావరణశాఖ విడుదల చేసింది. నిన్న ఉత్తర మధ్యప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగిన ఉత్తర దక్షిణ ద్రోణి లేదా గాలి విచ్చితి ఈరోజు ఈశాన్య బిహార్ నుండి జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, విదర్భ, మరత్వాడ, , అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతోంది. ఇది సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం ఎలా ఉంటుందనేది అధికారులు అంచనా వేసి వెదర్ బులిటెన్ విడుదల చేశారు.
ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం
ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణ ఉండే అవకాశం ఉంది. రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో ఉన్న క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అత్యవసమైతే తప్పు బయటకు రావొద్దని సూచించింది. వడదెబ్బ బారిన పడకుండా వృద్దులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయలో నమోదవుతున్నాయి. దీంతో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో మధ్యాహ్నం సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.

