అసెంబ్లీలో జరిగిన అద్భుత సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. సీఎం రేవంత్ రెడ్డి , మాజీ సీఎం కేసీఆర్ మధ్య షేక్ హ్యాండ్ వైరల్గా మారింది. సభకు వచ్చిన కేసీఆర్ను రేవంత్ మర్వాదపూర్వకంగా పలకరించారు. అయితే సభ ప్రారంభమైన కొద్దిసేపటికే కేసీఆర్ వెళ్లిపోవడంపై మంత్రులు విమర్శించారు.
తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్లి విష్ చేశారు. సిద్ధాంతపరంగా ఉప్పు – నిప్పులా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగినా.. సభలో కనిపించిన ఈ షేక్హ్యాండ్ సీన్ అందరినీ ఆకట్టుకుంది. దీనిని కొంతమంది సీన్ ఆఫ్ ది ఇయర్ అంటున్నారు. కేసీఆర్ మిగతా సభ్యుల అందరికంటే ముందుగా వెళ్లి తన సీట్లో కూర్చున్నారు. కాసేపటికి సభ లోపలికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు. కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి పలకరించారు..కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, కేసీఆర్ను పలకరించారు.
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభత్వ విప్లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ సహా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కేసీఆర్తో మాట్లాడారు. అటు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. సభ ప్రారంభమైన కాసేపటి తర్వాత హరీష్ రావుతో పాటు కేసీఆర్ బయటికి వచ్చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి నందినగర్ నివాసానికి వెళ్లిపోయారు.
సభ నుంచి కేసీఆర్ త్వరగా వెళ్లిపోవడంపై కోమటిరెడ్డి స్పందించారు. మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపే సమయంలో సభలో లేకుండా కేసీఆర్ వెళ్లిపోవడం సరైంది కాదని కోమటరెడ్డి అన్నారు. దివంగత సభ్యులకు మౌనం పాటించిన తర్వాత కేసీఆర్ వెళితే బావుండేదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ అసెంబ్లీ రావాలంటూ కాంగ్రెస్ నేతలు ఈ మధ్య తరచుగా డిమాండ్ చేశారు. రావల్సినపుడు వస్తారంటూ బీఆర్ఎస్ నేతలూ కౌంటర్లు ఇచ్చారు. చాలాకాలంగా నడిచిన ఎపిసోడ్ తర్వాత ఇవాళ కేసీఆర్ సభకు వచ్చారు. అయితే.. కాసేపే ఉండి వెళ్లిపోయారు. మళ్లీ జనవరి 2నుంచి సభ మొదలవుతుంది. నీళ్ల వివాదాలు సహా అనేక అంశాలపై వాడివేడి చర్చ జరగనుంది. అప్పుడు కేసీఆర్ సభకు వస్తారా.. చర్చల్లో పాల్గొంటారా లేదా అనేదే ఇప్పుడు కీలకంగా మారింది.క

