ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. దీంతో ఆయన ఢిల్లీ నుంచి కర్నూలుకు బయలుదేరారు. రెండు రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలో పర్యటించారు. పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ బిజీబిజీగా గడిపారు. అమరావతి నిర్మాణం, నీటిపారుదల ప్రాజెక్టులు వంటి పలు కీలక విషయాలపై వినతులు…
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. దీంతో ఆయన ఢిల్లీ నుంచి కర్నూలుకు బయలుదేరారు. రెండు రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలో పర్యటించారు. పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ బిజీబిజీగా గడిపారు. అమరావతి నిర్మాణం, నీటిపారుదల ప్రాజెక్టులు వంటి పలు కీలక విషయాలపై వినతులు అందించారు. కేంద్రమంత్రులు అమిత్ షా, అశ్వినీ వైష్ణవ్, మాండవీయ, నిర్మలాసీతారామన్, పాటిల్తో భేటీ అయ్యారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై నిర్మలా సీతారామన్తో చర్చించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి అంశాలు వివరించి… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి కేంద్రం నుంచి సాయం కోరారు. అలాగే సాస్కి కింద అదనంగా రూ.10వేల కోట్లు కేటాయించాలని సీఎం కోరారు. రెవెన్యూ లోటు భర్తీకి 16వ ఆర్థిక సంఘానికి ఇచ్చిన వినతిని అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు.
రాజధాని అమరావతికి రెండో విడత నిధులను గ్రాంటుగా విడుదల చేయాలని అభ్యర్థించారు. విభజన కారణంగా రాష్ట్రం ఇప్పటికీ ఆర్థిక లోటును ఎదుర్కొంటోందని నిర్మల దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. అమరావతి, పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకరిస్తున్నందుకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఈ భేటీలో రాయలసీమ ప్రాంతాన్ని కరవు నుంచి కాపాడేందుకు కేంద్రం మద్దతు అందించాలని కూడా చంద్రబాబు కోరినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇతర టీడీపీ ఎంపీలు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా పాల్గొన్నారు.
అంతకు ముందు కేంద్రమంత్రి మాండవీయతో భేటీ అయిన చంద్రబాబు.. పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన.. అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు అందించారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. అమరావతిలో జాతీయ “జల క్రీడల శిక్షణా హబ్” ఏర్పాటు చేసేందుకు అవకాశం పరిశీలించాలన్నారు. కృష్ణా నదీ తీరంలో వాటర్ స్పోర్ట్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు విస్తృత అవకాశాలున్నాయని భేటీలో వివరించారు.
నాగార్జునా యూనివర్సిటీ, కాకినాడలలో “నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ల” ఏర్పాటుు చేయాలని మాండవీయను చంద్రబాబు కోరారు. తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, నరసరావుపేటలలో “ఖేలో ఇండియా” కింద మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి 27 కోట్లు ఇవ్వాలన్నారు. గుంటూరు బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 170 కోట్లు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి 341 కోట్లు మంజూరు చేయాలని కోరారు సీఎం. తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని కోరారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ నిర్వహణకు 25 కోట్లు విడుదల చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు సీఎం చంద్రబాబు.
ఇక కేంద్రమంత్రి అమిత్షాతో భేటీ అయిన సీఎం చంద్రబాబు.. ఏపీకి చెందిన పలు అంశాలపై అమిత్షాతో చర్చించారు. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ను ప్రస్తావించారు. గోదావరి మిగులు జలాలు వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందన్నారు సీఎం చంద్రబాబు. రెండు తెలుగురాష్ట్రాల మధ్య హీట్ పుట్టిస్తున్న నీటి వాటాలపై కేంద్ర జలశక్తి శాఖ సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సమావేశంలో హాజరైన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో కృష్ణా, గోదావరి జలాలపై సమావేశంలో చర్చించారు. శ్రీశైలం ప్రాజెక్ట్ మరమ్మతులు, రక్షణ చర్యలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.