చైర్మన్ చంద్రబాబు.. అవును.. మీరు విన్నది నిజమే.. ఏపీ సీఎంగా మాత్రమే కాదు. పలు సంస్థలకు చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు.. ఏపీలో అన్ని పనులు చక్కబెట్టేందుకు, అభివృద్ధిని శరవేగంగా పట్టాలెక్కించేందుకు ఆయన చైర్మన్ బాధ్యతలు కూడా భుజాన వేసుకున్నారు. నిన్నటిదాకా ఒక లెక్క. ఇవాల్టి నుంచి మరో లెక్క అంటూ చైర్మన్ చంద్రబాబుగా మారిపోయారు.
చైర్మన్ చంద్రబాబు.. అవును.. మీరు విన్నది నిజమే.. ఏపీ సీఎంగా మాత్రమే కాదు. పలు సంస్థలకు చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు.. ఏపీలో అన్ని పనులు చక్కబెట్టేందుకు, అభివృద్ధిని శరవేగంగా పట్టాలెక్కించేందుకు ఆయన చైర్మన్ బాధ్యతలు కూడా భుజాన వేసుకున్నారు. నిన్నటిదాకా ఒక లెక్క. ఇవాల్టి నుంచి మరో లెక్క అంటూ ఏపీ సీఎం చంద్రబాబు..డ్రీమ్ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు.. చైర్మన్ చంద్రబాబుగా మారిపోయారు. అనుకున్న లక్ష్యాలు సాధించడానికి, ప్రాజెక్టులను చకచకా ముందుకు తీసుకుని వెళ్లడానికి చైర్మన్ అవతారం ఎత్తారు ఏపీ సీఎం. ఏపీకి రెండు కళ్లు పోలవరం, అమరావతి. ఈ మాట తరచూ చెబుతుంటారు చంద్రబాబు. ఆ పోలవరాన్ని కలిపే జలహారతి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనుల దాకా అంతా తానై వ్యవహరిస్తున్నారు బాబు.
చైర్మన్గా చంద్రబాబు.. వైస్ చైర్మన్గా పవన్ కల్యాణ్
సంపద సృష్టించాలి ఇది చంద్రబాబు తరచు చెప్పేమాట. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేయాలనేది ఆయన ఆలోచన. దీనికి ఆచరణ రూపం ఇచ్చేందుకు ఆయన మానస పుత్రిక P-4 రూపు దిద్దుకుంది. P-4 అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్షిప్ అని అర్థం. 2047 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం సహా సామాజిక-ఆర్థిక అసమానతలను తగ్గించడం, సమగ్ర అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర -2047 విజన్ ఆధారంగా ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం అమలు చేస్తోంది. ఈమధ్యే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీ4 విధానం ప్రకారం టాప్ పదిశాతంలో ఉన్న సంపన్న వ్యక్తులు, లేదా సంస్థలు అట్టడుగున ఉన్న 20 శాతం పేద కుటుంబాలను ఆదుకోవాలి. పేద కుటుంబాలకు స్థలాలు, ఇళ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, ఎల్పీజీ కనెక్షన్లు, విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు దీని ఆచరణలోనే మరో ముందడుగు పడింది. సీఎం చంద్రబాబు చైర్ పర్సన్గా P-4 సొసైటీ ఏర్పాటయింది. దీనికి వైస్ చైర్ పర్సన్గా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉంటారు. సీఈవో, డైరెక్టర్తో పాటు వారికి అనుసంధానంగా కాల్ సెంటర్, సాంకేతిక బృందం, ప్రోగ్రాం టీమ్, వింగ్ టీమ్లు ఏర్పాటు చేయనున్నారు.కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు…మార్గదర్శులను గుర్తించాలి. ఆగస్టులోగా ఈ సొసైటీకి విధివిధానాలు రూపొందిస్తారు. 5 లక్షల బంగారు కుటుంబాలను సంపన్నులు దత్తత తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలనేది చంద్రబాబు లక్ష్యం.
జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు
ఇక నెంబర్ 2. జలహారతి కార్పొరేషన్. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు ఏపీ సర్కార్ దీన్ని ఏర్పాటుచేసింది. కంపెనీల చట్టం కింద వంద శాతం ప్రత్యేక వాహక సంస్థగా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు అయింది. దీనికి చైర్మన్గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటారు. ఇక మంత్రి నిమ్మల రామానాయుడు వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు. సంస్థ సీఈఓగా జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు ఉంటారు.
ఇక ఏపీకి రెండు కళ్ల లాంటి పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి…ఈ రెండింటిని పూర్తి చేసే బాధ్యతను కూడా తన భుజస్కంధాల పైనే వేసుకున్నారు చంద్రబాబు. జలహారతి, P-4 ప్రాజెక్టులు కూడా ఆయన నేతృత్వంలోనే అడుగులు ముందుకు వేయనున్నాయి. ఇలా సీఎం బాధ్యతలతో పాటు.. తన డ్రీమ్ ప్రాజెక్టులను ముందుకు తీసుకు వెళ్లడానికి చంద్రబాబు చైర్మన్గా మారారు.