అట్లాంటి.. ఇట్లాంటి సభ కాదు! రాబోయే నాలుగేళ్లకు రూట్ మ్యాప్.. చంద్రబాబు సర్కార్ నయా స్ట్రాటజీ

అట్లాంటి.. ఇట్లాంటి సభ కాదు! రాబోయే నాలుగేళ్లకు రూట్ మ్యాప్.. చంద్రబాబు సర్కార్ నయా స్ట్రాటజీ

సంప్రదాయానికి భిన్నంగా..! వాస్తవానికి దగ్గరగా జూన్‌12న సభ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది కూటమి ప్రభుత్వం. సాధారణ వార్షికోత్సవంలా కాకుండా.. జనం భాగస్వామ్యంతో, అభివృద్ధి ఆశయాలతో జనోత్సవంలా నిర్వహించబోతోంది. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణం దాకా.. కోస్తా నుంచి రాయలసీమ వరకు ఆ రోజు ప్రత్యేకత ప్రతిబింబించేలా సుపరిపాలన-స్వర్ణాంధ్రప్రదేశ్‌ పేరుతో వేడుకలు జరిపేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది.

సంక్రాంతిని గుర్తుతెచ్చేలా.. దసరాను మైమరిపించేలా.. సుపరిపాలన-స్వర్ణాంధ్రప్రదేశ్‌ సభను నిర్వహించేందుకు ఉవ్విళ్లూరుతోంది కూటమి సర్కార్. గత అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించి సంవత్సరం పూర్తవుతుండటంతో.. ఎంతో వినూత్నంగా సభను ప్లాన్‌ చేస్తోంది. సాధారణ వార్షికోత్సవ సభలా నేతల ప్రసంగాలకే పరిమితం కాకుండా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ వేడుకగా ఓ పెద్దపండుగలా మలచాలని ఏపీ సర్కార్‌ భావిస్తోంది. ఇప్పటికే వివిధ శాఖల కింద రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు ప్రారంభించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక గ్రామం, నియోజకవర్గం కాకుండా, మొత్తం రాష్ట్రానికే అభివృద్ధి సంకేతాలు ప్రసరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే సంబంధిత అధికారులకు సీఎం కార్యాలయం స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

ప్రజల చైతన్యం, పాలకుల నిబద్ధత, ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయంలాంటి అంశాలు జూన్ 12నాటి వేడుకను ప్రత్యేకంగా నిలుపనున్నాయని భావిస్తున్నారు కూటమి ప్రభుత్వ పెద్దలు. అంతేకాదు.. సంవత్సరకాలంలో ఏం చేశారో ప్రజలకు చెప్పనున్నారు. ఏడాది పాలనలో రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం.. దాదాపు 8.5 లక్షల ఉద్యోగ అవకాశాల కల్పనను ఏపీ సర్కారు తన సామర్థ్యంగా ప్రదర్శించాలని యోచిస్తోంది. పాలన అంటే అభివృద్ధి అని ప్రజలకు గుర్తుచేసే ప్రయత్నంగా ఈ సంబరాలు ఉండబోతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఇక సభావేదికపై సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. ఈ మేరకు కూటమి ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఇప్పటికే సమావేశం నిర్వహించారు. అలాగే.. రాబోవు నాలుగేళ్లలో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు..! ప్రణాళికలు ఏంటి, నాలుగేళ్ల పాలన ఏ విధంగా కొనసాగనుంది అనే దానిపై చంద్రబాబు ఓ క్లారిటీ ఇవ్వనున్నారు.

స్వర్ణాంధ్ర-2047 అంటూ ఇప్పటికే ఓ యాక్షన్‌ ప్లాన్‌తో ముందుకెళ్తోంది కూటమి ప్రభుత్వం. 175 నియోజకవర్గాల్లోనూ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలను ప్రారంభించింది. అంతేకాదు.. ఓ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ను సైతం ఏర్పాటు చేసి, అభివృద్ధే అజెండాగా ముందుకు సాగుతోంది. ఆ స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌ను సుపరిపాలన-స్వర్ణాంధ్రప్రదేశ్‌ వేడుకలో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది కూటమి సర్కార్. మొత్తంగా.. రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు సైతం తెలిసేలా సభను నిర్వహించి విజయవంతం చేయాలని భావిస్తోంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు