ఇంటర్ అర్హత కలిగిన ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు.. ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదే శాఖకు చెందిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) పోస్టుల భర్తీకి కూడా తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖలో ఇటీవల 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదే శాఖకు చెందిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) పోస్టుల భర్తీకి కూడా తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 5, 2025వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. FSO పోస్టులకు త్వరలోనే ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. ఇంటర్ అర్హత కలిగిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు.. జులై 1, 2025 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు గరిష్ఠ వయసులో మినహాయింపు ఉంది. క్యారీ ఫార్వర్డ్ అయిన ఉద్యోగాలకు 10 ఏళ్లూ, కొత్తగా ప్రకటించిన ఉద్యోగాలకు 5 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. మొత్తం పోస్టుల్లో 20 శాతం ఉద్యోగాలు నాన్ లోకల్ కోటాకి కేటాయిస్తారు. కాబట్టి ఒకవేళ సొంత జిల్లాలో ఉద్యోగాలు లేనివారు పక్క జిల్లాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు రాత పరీక్ష సెప్టెంబర్ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆఫ్లైన్ విధానంలో పెన్ను, పేపర్ పద్ధతిలో జరనుంది. ఈ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే ఈ పోస్టులకు సంబంధించిన సిలబస్ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. రాత పరీక్ష ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలతోపాటు శారీరక కొలతల అర్హత, నడక పరీక్షలూ ఉంటాయి. స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి నడక, మెడికల్ పరీక్షలు ఉంటాయి. అన్నిట్లోనూ అర్హత పొందినవారికి మాత్రమే ఉద్యోగం వరిస్తుంది.
స్క్రీనింగ్ పరీక్ష ఎలా ఉంటుందంటే..
ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 150 మార్కులకు 150 నిమిషాల్లో నిర్వహిస్తారు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో మాత్రమే ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇందులో పార్ట్ ఎ, పార్ట్ బి అనే రెండు భాగాలుగా ప్రశ్నలు అడుగుతారు. ఒక్కొక్క విభాగం నుంచి 75 ప్రశ్నలు వస్తాయి. 45 రోజుల సమయమే ఉంది కాబట్టి కొత్తగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు పూర్తిగా సమయం కేటాయించి చదివితే విజయం వరిస్తుంది.
సిబలస్ ఇలా..
పార్ట్ ఎలో.. జాతీయ అంతర్జాతీయ వర్తమానాంశాలు ఉంటాయి. అలాగే సాధారణ స్థాయి రీజనింగ్, పర్యావరణ పరిరక్షణ- సంతులిత అభివృద్ధి, విపత్తు నిర్వహణ, గ్రామీణ అభివృద్దిపై ప్రశ్నలు వస్తాయి. అలాగే ఇండియా, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలు, భారత రాజ్యాంగం, చరిత్రలోని జాతీయోద్యమం, జాతీయోద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్లోని పరిణామాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ.. నుంచి ఈ విభాగంలో ప్రశ్నలు వస్తాయి.
పార్ట్ బిలో.. జనరల్ సైన్స్ (జంతు- వృక్షశాస్త్ర అంశాల ప్రాథమికాంశాలు), మానవ శరీర నిర్మాణం, రసాయన శాస్త్రంలోని లోహ, అలోహ చాప్టర్స్, కార్బన్, ఇంధన వనరులకు సంబంధిత అంశాలు, పర్యావరణ సంబంధిత విషయాలు, సాధారణ గణితంలో అంకగణితం, జామెట్రీ, స్టాటిస్టిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. అన్ని విభాగాల్లో బేసిక్స్పై కాస్త దృష్టి పెడితే సరిపోతుంది.