రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పీజీ సెట్ 2025 పరీక్షలు సోమవారం (జూన్ 9) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సెట్ ఛైర్మన్ అప్పారావు, కన్వీనర్ పీసీ వెంకటేశ్వర్లు పరీక్షల వివరాలను వెల్లడించారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పీజీ సెట్ 2025 పరీక్షలు సోమవారం (జూన్ 9) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సెట్ ఛైర్మన్ అప్పారావు, కన్వీనర్ పీసీ వెంకటేశ్వర్లు పరీక్షల వివరాలను వెల్లడించారు. పీజీ సెట్ పరీక్షలకు హైదరాబాద్తో పాటు రాష్ట్రంపీలోని 30 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు ఆన్లైన్ విధానంలో జూన్ 9 నుంచి 12 వరకు జరగనున్నాయి. రాత పరీక్షలు రోజుకు మూడు సెషన్లలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు, మూడవ సెషన్ సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు జరుగనున్నాయి. మొదటి రోజు 17 సబ్జెక్టులకు, రెండో రోజు 7 సబ్జెక్టులకు, మూడవ రోజు 5 సబ్జెక్టులకు, నాల్గవ రోజు 2 సబ్జెక్టులకు ఈ పరీక్షలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25,688 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఫలితాలను జూన్ 25లోపు విడుదల చేస్తామని, ఆ తర్వాత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు.
జూన్ 13 వరకు ఏపీ పీసెట్ దరఖాస్తులు.. టెస్ట్ ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యాయామ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వ్యాయామ కోర్సుల్లో ప్రవేశాల కోసం పీసెట్ పరీక్షలు జూన్ 23 నుంచి ప్రారంభమవుతాయని సెట్ కన్వీనర్ పాల్కుమార్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 7వ తేదీతో ముగిసింది. అయితే రూ.1,000 ఆలస్య రుసుంతో జూన్ 11 వరకు, రూ.2000 ఆలస్య రుసుంతో జూన్ 13 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. అభ్యర్థుల హాల్టికెట్లు జూన్ 17 నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఆయా తేదీల్లో షెడ్యూల్ ప్రకారం దేహదారుఢ్య పరీక్షలు జరిపి, ఎంపిక చేస్తామని సూచించారు.
ఈవారంలోనే తెలంగాణ ‘సీపీగెట్ 2025’ నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షకు సంబంధించిన సీపీగెట్ 2025 నోటిఫికేషన్ ఈ వారంలో జారీ కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి కన్వీనర్ నియామకం ఆలస్యం ఆలస్యం కావడం వల్ల నోటిఫికేషన్ జారీ ఆలస్యమైంది. ఈ ప్రక్రియ తాజాగా పూర్తి కావడంతో వారం రోజుల్లో సీపీగెట్ ప్రకటన జారీ చేయనుంది.